వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గాయం కారణంగా టీమిండియాకు దూరమైన ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలోసెలెక్టర్లు శార్దూల్ ఠా కూర్ను ఎంపిక చేశారు. విండీస్తో నిర్ణయాత్మక టి20 మ్యాచ్ తర్వాత భువీ తనకు ఇబ్బందిగా ఉందని టీమ్ మేనేజిమెంట్కు చెప్పినట్లు తెలుస్తోంది. భువీ వెన్నునొప్పితో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. కోలుకొని ఒక సిరీస్ ఆడాడో లేదో మళ్లీ ఆ నొప్పి తిరగబెట్టింది. అయితే రాబోయే రోజుల్లో కీలక సిరీస్ ఉన్న కారణంగా వెస్టిండీస్తో సిరీస్లో అతడ్ని ఆడించక పోవడమే మంచిదని టీమ్ మేనేజిమెంట్ భావించింది. దాదాపు రెండేళ్లుగా భువీ గాయాలతో బాధపడుతూనే ఉన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో సిరీస్లో కూడా అతను ఆడలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్లకు కూడా అందుబాటులో లేడు. తర్వాత కోలుకొని జట్టులోకి వచ్చినా అంతగా ప్రభావం చూపించలేదు. 2019 వన్డే ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్లో గాయపడినప్పటికీ టోర్నమెంటులో కొనసాగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లు ఆడలేదు. మూడు నెలల విరామం తర్వాత విండీస్తో సిరీస్కు ఎంపికయ్యాడు. అంతలోనే మళ్లీ ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా భువీ స్థానంలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలించిన సెలెక్టర్లు చివరికి శార్దూల్ను ఎంపిక చేశారు.