"త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు"

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 06:45 PM


దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కరోనా వేళ ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే అని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌, కావేరమ్మపేట-గంగాపూర్‌ బీటీ రహదారి, నల్లచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి పనులను కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కావేరమ్మపేటలో రెండు పడకగదుల ఇళ్లను పరిశీలించారు. జడ్చర్ల పట్టణంలో మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్ల కోసం యుద్ధం చేసే పరిస్థితి ఉండేదని కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లిస్తున్నామని గుర్తు చేశారు. గతంలో ఏప్రిల్, మే నెలల్లో కరెంటు కోతలుండేవని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

జడ్చర్లకు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని కేటీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలన్నదే కేసీఆర్ అభిమతం అని చెప్పారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. త్వరలో జడ్చర్లలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో 27 వార్డుల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధిని కానుకగా ఇస్తామని మంత్రి చెప్పారు.





Untitled Document
Advertisements