ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్.. చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 143/9కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (54: 37 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీ బాదినా.. అతను ఔట్ తర్వాత హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సమయానికి 115/2తో మెరుగైన స్థితిలో ఉన్న సన్రైజర్స్.. ఆఖరికి 142/9తో మ్యాచ్ని చేజార్చుకోవడం గమనార్హం. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ షబాజ్ అహ్మద్ మ్యాచ్ని మలుపు తిప్పాడు.
తొలుత మాక్స్వెల్ (59: 41 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ రెండు, నదీమ్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
150 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ సాహా (1) నిరాశపరిచినా.. మనీశ్ పాండే (38: 39 బంతుల్లో 2x4, 2x6)తో కలిసి హైదరాబాద్ టీమ్ని డేవిడ్ వార్నర్ నడిపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్.. టీమ్ స్కోరు 96 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత జానీ బెయిర్స్టో (12: 13 బంతుల్లో 1x4) దూకుడు పెంచే క్రమంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన షబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఫస్ట్ బాల్కే ఔటైపోయాడు. అదే ఓవర్లో మనీశ్ పాండే, అబ్దుల్ సమద్ (0) కూడా భారీ షాట్కి వెళ్లి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక అక్కడి నుంచి మ్యాచ్ నెమ్మదిగా హైదరాబాద్ నుంచి చేజారుతూ వచ్చింది.
హైదరాబాద్ విజయానికి చివరి 12 బంతుల్లో 27 పరుగులు అవసరమవగా.. రషీద్ ఖాన్ (17: 9 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడి గెలుపు ఆశలు రేపాడు. కానీ.. అతనికి జేసన్ హోల్డర్ (4), భువనేశ్వర్ కుమార్ (2) నుంచి సపోర్ట్ లభించలేదు. దాంతో.. హైదరాబాద్కి 6 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో షబాబ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక కైల్ జెమీషన్కి ఒక వికెట్ దక్కగా.. రషీద్ ఖాన్ చివరి ఓవర్లో రనౌటయ్యాడు.