రూ. 2 వేలు కోసం 50 గుడ్లు తింటానని పందెం.... విషాదం!!!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 12:18 PM

రూ. 2 వేలు కోసం 50 గుడ్లు తింటానని పందెం.... విషాదం!!!

రూ.2 వేల కోసం కాసిన పందెం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మృతుడి కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి రూ.2 వేల కోసం తన స్నేహితులతో పందెం కట్టాడు. 50 గుడ్లను ఆగకుండా తినేస్తానని తెలిపాడు. దీంతో స్నేహితులు అతడి ముందు 50 గుడ్లు ఉంచారు. యాదవ్.. ఒక్కకొక్కటీ తినేస్తూ వారిని ఆశ్చర్యపరిచాడు. 42వ గుడ్డు తింటున్న సమయంలో ఒక్కసారే స్పృహ కోల్పోయాడు. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడు.



గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. మరి, అతడు గుడ్లు తినడం వల్ల ఎందుకు చనిపోయాడనే కోణంలో వైద్య నిపుణులు కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నించారు. ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అతడి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని కనుగొన్నారు. ముఖ్యంగా గుడ్డులో ఉండే పచ్చ సొనలో అధిక కొవ్వులు ఉంటాయని, దీనివల్ల గుండె పనితీరు నెమ్మదించి ప్రాణాలు పోయాయని తెలిపారు.
ఈ అరుదైన కేసును Medizzy అనే హెల్త్‌ వెబ్‌సైట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. గుడ్లు ఆరోగ్యానికి హానికరమా? అనే అంశంపై జరిగిన వివిధ అధ్యయనాల గురించి వివరించింది. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల చనిపోయే ముప్పు ఏడు శాతానికి పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలిందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చ సోనే ఎక్కువ ప్రమాదకరమని తెలిపింది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

చైనాలోని జెజియాంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇగూ జాంగ్ మాట్లాడుతూ.. ‘‘గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డులోని తెల్ల సొన లేదా ఇతరాత్ర ప్రత్యామ్నాయ ప్రోటీన్లు తీసుకోవడమే ఉత్తమం అని మా పరిశోధనలో తెలేంది. ఎక్కువ మరణాలు కొవ్వు స్థాయిలు పెరగడం వల్లే చోటుచేసుకుంటున్నాయని తెలిసింది’’ అని తెలిపారు. చూశారుగా.. గుడ్లు అతిగా తినే అలవాటు ఉంటే తగ్గించడం మంచిది. దీనిపై మీరు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.





Untitled Document
Advertisements