దేశంలో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారా?....భారీగా బెట్టింగ్‌లు వేస్తున్న బుకీలు!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:13 PM

దేశంలో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారా?....భారీగా బెట్టింగ్‌లు వేస్తున్న బుకీలు!

క్రికెట్ బెట్టింగ్‌లు, ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు గురించి తెలుసు... ఏ టీమ్ గెలుస్తుంది.. ఎవరు విజయం సాధిస్తారనేది బుకీల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. దీంతో వందలు, వేల కోట్ల రూపాయాలు చేతులు మారుతుంటాయి. కొత్తగా లాక్‌డౌన్‌పై బుకీల కన్నుపడింది. కరోనా లాక్‌డౌన్ పేరుతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఫలానా తేదీ నుంచి లాక్‌డౌన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిని కూడా బుకీలు క్యాష్ చేసుకుంటున్నారు. దేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మే 2 నుంచి లాక్ డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. నెల రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్రికెట్ బెట్టింగ్ లాగే లాక్‌డౌన్‌పై కూడా యువత బెట్టింగులు కాస్తున్నారు. జనాల వీక్‌నెస్‌ను ఇలా కూడా బెట్టింగు రాయుళ్లు తమకు అనుకూలంగా మలచుకుని జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిఘా పెట్టారు.
గతేడాది కూడా లాక్‌డౌన్, కోవిడ్ తీవ్రత గురించి భారీగానే బెట్టింగులు జరిగాయి. వివిధ నగరాల్లో కోవిడ్ కేసులు, మరణాలపై రోజువారీ బెట్టింగులు జరిగినట్టు ఢిల్లీకి చెందిన ఓ బుకీ వెల్లడించాడు. కొత్తరకం వైరస్ కావడంతో దీనిపై జోరుగానే బెట్టింగులు నిర్వహించామని తెలిపాడు. గతేడాది తొలి దశ లాక్‌డౌన్ విధించినప్పుడు ఎప్పుడు ఆంక్షలు సడలిస్తారనే అంశంపై జోరుగా బెట్టింగులకు పాల్పడ్డారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా గతేడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడటంతో బుకీలు దీనిని ఎంచుకున్నారు.
ఒకవైపు రోజు రోజుకి కరోనా సెకండ్ వేవ్ మరోసారి విజృంభిస్తూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఈ నేపథ్యంలో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. విద్యా సంస్థలను మూసివేసి, పరీక్షలను కూడా ఒడిశా, హరియాణా, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు రద్దుచేశాయి.





Untitled Document
Advertisements