కూలీలుగా మారి జీవనం సాగిస్తున్న క్యాబ్ డ్రైవర్లు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:51 PM

కూలీలుగా మారి జీవనం సాగిస్తున్న క్యాబ్ డ్రైవర్లు

కరోనా వైరస్ లక్షలాది మంది జీవితాలను అగమ్యగోచరంగా మార్చేస్తోంది. అప్పో సొప్పో చేసి జీవితంలో స్థిరపడాలని వ్యాపారం ప్రారంభించిన ఎంతో మంది కరోనా మహమ్మారి దెబ్బకి అప్పుల పాలవుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ల దీనగాధ గురించి ఎంత చెప్పుకున్నా ఆవేదన తీరదు. ఇన్నాళ్లూ నగరవాసుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన వారంతా ఇప్పుడు గమ్యం లేకుండా మిగిలిపోయారు. ఓవైపు కరోనా లాక్‌డౌన్‌, మరోవైపు పెరిగిన చమురు ధరలు తట్టుకోలేక చాలామంది క్యాబ్‌లను అమ్మేసి దినసరి కూలీలుగా మారిపోయారు. హైదరాబాద్ నగరంలో నడుస్తున్న ప్రైవేట్‌ క్యాబ్‌ల్లో దాదాపు 80 శాతం ఫైనాన్స్‌లో ఉన్నవే. లాక్‌డౌన్‌ తర్వాత నగరంలో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఐటీ ఉద్యోగులు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో బండి రోడ్డెక్కినా ప్రయోజనం ఉండట్లేదు. నిర్వహణ ఖర్చులు పోను వచ్చే రోజువారీ ఆదాయం ఇల్లు గడిచేందుకే సరిపోవట్లేదు. కొందరు అప్పులు చేసి మరీ ఈఎంఐలు కడుతుండగా.. కట్టలేని వారిని ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసి క్యాబ్‌లు తీసుకెళ్లిపోతున్నారు. దీంతో తాము రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందని డ్రైవర్లు వాపోతున్నారు. లాక్‌డౌన్‌కి ముందు హైదరాబాద్‌లో 1.40 లక్షల ప్రైవేట్‌ క్యాబ్‌లు నడిచేవి. లాక్‌డౌన్‌ తర్వాత 40 వేలే రోడ్డెక్కుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం వాటి సంఖ్య మరీ తగ్గిపోయింది. గతంలో ఓలా, ఉబర్‌లాంటి అగ్రిగేటర్లు డ్రైవర్లకు కి.మీ.కు రూ.13 నుంచి రూ.15 చెల్లించేవి. అది డీజిల్‌ ధర రూ.60 ఉన్నప్పటి రేటు. ఇప్పుడు రూ.84 అయినా అదే కొనసాగిస్తుండడంతో పాటు వివిధ పన్నులతో పాటు 25% కమీషన్లు తీసుకోవడంతో డ్రైవర్లకు రోజుకూలీ మిగలట్లేదు. ఆయా సంస్థలు కమీషన్లు తగ్గించుకోవాలని డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. యాప్‌ బేస్‌ రవాణా సంస్థలు డ్రైవర్ల సంక్షేమ రీత్యా కమీషన్‌ను 10 శాతానికి తగ్గించాలని తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జేఏసీ ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్‌ ధరల్ని జీఎస్టీలోకి చేర్చాలని, డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాల్ని ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. కరోనా, పెరిగిన చమురు ధరల కారణంగా ఎన్నో వేల క్యాబ్‌ డైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఏళ్ల కిత్రం పల్లె వదిలి నగరానికి వచ్చారు జనార్దన్‌ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో కారు కొనుగోలు చేసి క్యాబ్‌ డ్రైవర్‌గా మారాడు. కొద్ది నెలలకే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో పూట గడవడమే కష్టంగా మారింది. ఫైనాన్స్‌ చెల్లించేందుకు చేతిలో డబ్బుల్లేక, ఫైనాన్షియర్ల ఒత్తిడి తట్టుకోలేక భార్య పుస్తెలతాడు అమ్మేసి ఒక నెల వాయిదా కట్టాడు. రెండో నెలకు కిస్తీ కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో ఫైనాన్షియర్లు కారును తీసుకెళ్లిపోయారు. కుటుంబాన్ని పోషించేందుకు ఇప్పుడు భవన నిర్మాణ కూలీగా మారాడు. మధురానగర్‌ కాలనీలో ఉండే యాదగిరి అనే యువకుడు ఐదేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో కార్లు రోడ్డెక్కకపోవడం, ఆ తర్వాత చమురు ధరలు భారీగా పెరగడంతో డ్రైవింగ్‌ను వదిలేశాడు. ప్రస్తతం పంజాగుట్ట సెంటర్‌లో చెరుకు రసం బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరే కాదు గతంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఓ వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు ఉపాధి కూలీలు, వాచ్‌మెన్లు మారి దుర్భర జీవితం గడుపుతున్నారు.









Untitled Document
Advertisements