టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు ఛైర్మన్‌గా తెలుగుతేజం...సీఈఓ నుంచి సత్య నాదెళ్లకు ప్రమోషన్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 01:16 PM

టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు ఛైర్మన్‌గా తెలుగుతేజం...సీఈఓ నుంచి సత్య నాదెళ్లకు ప్రమోషన్

తెలుగుతేజం సత్య నాదేళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. బోర్డు ఛైర్మన్‌గా సత్య నాదేళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 నుంచి సత్య నాదేళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో థామ్సన్‌ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం ఆయనను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మైక్రోసాఫ్ట్ నుంచి గేట్స్ పూర్తిగా తప్పుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో బోర్డు కార్యవర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన 'బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌' నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్‌ అప్పట్లో ప్రకటించారు. అయితే, అది నిజం కాదని పలు అంతర్జాతీయ పత్రికలు తాజాగా పేర్కొన్నాయి. సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని.. దీనిపై బోర్డు ఓ బయటి న్యాయ సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బోర్డు నుంచి వైదొలిగినట్లు మైక్రోసాఫ్ట్‌ అధికారిక వర్గాలే వెల్లడించినట్లు తెలిపాయి. కాగా, 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన సత్య నాదెళ్ల.. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సీఈవో బామర్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. 1976 నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి సత్య నాదెళ్ల. సత్య నాదెళ్ల స్వస్థలం ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేసి.. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. అలాగే, దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం బిల్‌గేట్స్‌ దంపతులు గత నెల కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విడిపోవడానికి దారితీసిన కారణాలు ఈ జంట బయటపెట్టలేదు. కానీ, లైంగిక వేధింపుల కేసుల్లో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మిలిండా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది.





Untitled Document
Advertisements