"కరోనా రాదని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు - బ్లీచింగ్ పౌడర్ చల్లితే వైరస్ పోతుందని జగన్ అనేశారు.....వాళ్లనేం చేయాలి సార్?"

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 05:04 PM


కరోనా వైరస్ మూడో వేవ్‌పై ప్రముఖ కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో మల్లిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండ్రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఆయన్ను నేరుగా ఇంటర్వ్యూ చేశారు. మరోవైపు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పరుచూరి మల్లిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ అబద్ధమని, మరీ ప్రజల్లో భయం కల్పించే విధంగా ఉన్నాయని కొట్టిపారేశారు. దీంతో మల్లిక్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (అంటువ్యాధుల చట్టం) కింద కేసు నమోదు చేయించినట్లు హెల్త్ డైరెక్టర్ చెప్పారు. పరుచూరి మల్లిక్ ఇంత భయానకంగా మట్లాడుతున్నారంటే.. వైరస్ తయారీలో ఆయన పాత్ర కూడా ఉండి ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే, బుధవారం దీనిపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు సూటి ప్రశ్నలు వేస్తూ వరుస ట్వీట్లు చేశారు.




‘‘గౌరవనీయులైన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గారు కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ హెల్త్ డెరెక్టర్ గారు.. మీరు పరుచూరి మల్లిక్ క్రైమ్స్ గురించి మాట్లాడుతుంటే నాకు కొన్ని కొన్ని డౌట్లు వస్తున్నాయి. మూడో వేవ్ గురించి పరుచూరి మల్లిక్‌ మాట్లాడిన మాటలు తప్పుడువని ఎలా కొట్టిపారేస్తారు? ఆయన చెప్పినవి జరగనప్పుడే కదా అవి అబద్ధమని తేల్చిది. మరి రెండో వేవ్ గురించి మీకు, మీ నిపుణులకు తెలియదా?




మూడో వేవ్ కంటే ముందే పరుచూరి మల్లిక్‌‌ను తప్పుబడుతుంటే.. సెకండ్ వేవ్ గురించి మీరు చెప్పినవి కూడా తప్పులయ్యాయి. మరి మీ ఎక్స్‌పర్ట్స్‌ని ఏం చేయాలి? వందల మంది నిపుణులు మీడియాలో తమ అంచనాలను చెబుతుంటే.. జనం మల్లిక్‌ వ్యాఖ్యలవైపే చూశారు. అది మీ నిపుణుల ఫెయిల్యూర్ కదా?




మరి సీఎంలు కేసీఆర్, జగన్‌లను ఏం చేయాలి సార్. కరోనా అసలు రానేరాదని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే వైరస్ పోతుందని జగన్ అనేశారు. మరి వాళ్లనేం చేయాలి సార్? ఇంకా రాష్ట్రంలో ఆక్సీజన్ సరఫరా సరిగ్గా లేక పడకలు లేకపోవడం వల్ల ఎంతో మంది మరణించారు. ఈ తప్పిదాలకు ఏ చట్టం వాడతారు సార్?’’




పరుచూరి మల్లిక్ కరెక్టో కాదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు. కానీ, నేను మాత్రమే కాక జనమంతా ఆయన మాటలు ఆలకిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు విషయంలో విఫలమైందని పరుచూరి మల్లిక్ వంక జనం చూస్తున్నారు.




సార్ మీరు కనీసం నా చెవిలో చెప్పండి సార్. టాప్ ప్రభుత్వ అధికారులంతా యశోద, అపోలో ఆస్పత్రులకే ఎందుకు వెళ్తున్నారో? గాంధీకి ఎందుకు వెళ్లట్లేదో? ప్లీజ్ చెప్పండి సార్. మీరు ఒక ఆలోచనకు సమాధానం ఇవ్వలేనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య శక్తిని ఉపయోగిస్తారని మా అమ్మ మీతో చెప్పమని చెప్పారు. పరుచూరి మల్లిక్ కామెంట్స్‌ను ఖండించేముందు పాయింట్ టు పాయింట్ అర్థమయ్యే రీతిలో ఆయన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.




మీరు నాపైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడంలో చాలా బిజీగా లేకుంటే తప్ప.. మీరు నా ప్రశ్నల్లో కనీసం కొన్నింటికైనా సమాధానం ఇస్తారని అనుకుంటున్నా.’’ అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. వాటికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రెస్ మీట్‌ క్లిప్ కూడా జత చేశారు.




కొద్ది రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో కెమికల్ ఇంజినీర్ అయిన పరుచూరి మల్లిక్ పాల్గొని కరోనా థర్డ్ వేవ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వేవ్ అత్యంత భయానకంగా ఉంటుందని, వ్యాక్సిన్లు పని చేయబోవని, పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంటికొకరు చనిపోతారంటూ కూడా మాట్లాడారు. దీనిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరుచూరి మల్లిక్‌పై మండిపడడం.. ఆర్జీవీ తాజా ప్రశ్నల వర్షానికి దారి తీసింది.









Untitled Document
Advertisements