ఫస్ట్ వన్డేపై జోక్‌ల వర్షం

     Written by : smtv Desk | Tue, Jul 20, 2021, 12:02 PM

ఫస్ట్ వన్డేపై జోక్‌ల వర్షం

శ్రీలంకకి ఫస్ట్ వన్డేలోనే భారత కుర్రాళ్లు ముచ్చెమటలు పట్టించేశారు. కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు కేవలం 36.4 ఓవర్లలోనే 263/3తో ఛేదించేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9x4) ఫస్ట్ పవర్‌ప్లేలోనే బౌండరీల మోత మోగించగా.. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (59: 42 బంతుల్లో 8x4, 2x6) సిక్స్‌తో మొదలెట్టి సగం మ్యాచ్‌ని ఫినిష్ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చివరి వరకూ క్రీజులో నిలిచిన కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్: 95 బంతుల్లో 6x4, 1x6) నింపాదిగా సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్: 20 బంతుల్లో 5x4)తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. వాస్తవానికి ఈ భారత జట్టుని ద్వితీయ శ్రేణి జట్టుగా శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ ఎద్దేవా చేశాడు. ఇలాంటి టీమ్‌తో ఆడటం శ్రీలంక జట్టుకి అవమానకరమని కూడా చెప్పుకొచ్చాడు. కానీ.. అంచనాలకి మించి రాణించిన పృథ్వీ షా, ఇషాన్ కిషన్.. ఏ దశలోనూ శ్రీలంక బౌలర్లకి బెదరలేదు. పృథ్వీ షాని కట్టడి చేసేందుకు శ్రీలంక కొత్త కెప్టెన్ షనక వరుసగా బౌలర్లని మార్చినా అతను మాత్రం జోరు తగ్గించలేదు. సీనియర్ బౌలర్ ఉదాన సైతం హ్యాట్రిక్ ఫోర్లు షాకి సమర్పించుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా అంతే.. సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లి మరీ భారీ షాట్లు ఆడాడు. దెబ్బకి సగం ఓవర్లు ముగిసే సమయానికే మ్యాచ్‌పై శ్రీలంక ఆశలు వదులుకుంది. చివర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా హసనరంగకి హ్యాట్రిక్ ఫోర్లు బాదేశాడు. మొత్తంగా భారత బ్యాట్స్‌మెన్ ఎదురుదాడి చేస్తుంటే.. శ్రీలంక బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒక ఎండ్‌లో కుర్రాళ్లు దంచుతుంటే.. నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి శిఖర్ ధావన్ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. శ్రీలంక జట్టులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. కరుణరత్నె (43: 35 బంతుల్లో 1x4, 2x6) అదీ.. చివర్లో కాస్త బ్యాట్ ఝళిపించి ఆ జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. కెప్టెన్ షనక (39), అసలంక (38), అవిష్కా ఫెర్నాండో (33) క్రీజులో సెటిలైనా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహల్, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ తీశారు. భువనేశ్వర్ కుమార్ 9 ఓవర్లు వేసినా.. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. దానికి తోడు.. భారత్ జట్టులో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ అతనే. ఇక రెండో వన్డే మంగళవారం కొలంబో వేదికగానే జరగనుంది.








Untitled Document
Advertisements