2nd ODI: బ్యాటింగ్ ఎంచుకున్న లంక..ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి భారత్

     Written by : smtv Desk | Tue, Jul 20, 2021, 02:59 PM

2nd ODI: బ్యాటింగ్ ఎంచుకున్న లంక..ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి భారత్

భారత్‌తో కొలంబో వేదికగా మంగళవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత ఆదివారం అక్కడే జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో శ్రీలంకని ఓడించిన శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా మూడు వన్డేల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఉదాన స్థానంలో తుది జట్టులోకి కసున్ రజితాని తీసుకున్న శ్రీలంక టీమ్.. కనీసం ఈ వన్డేలోనైనా టీమిండియాకి పోటీనివ్వాలని ఆశిస్తోంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ ధావన్ స్పష్టం చేశాడు.

India (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan(c), Ishan Kishan(w), Manish Pandey, Suryakumar Yadav, Hardik Pandya, Krunal Pandya, Deepak Chahar, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Kuldeep Yadav

Sri Lanka (Playing XI): Avishka Fernando, Minod Bhanuka(w), Bhanuka Rajapaksa, Dhananjaya de Silva, Charith Asalanka, Dasun Shanaka(c), Wanindu Hasaranga, Chamika Karunaratne, Kasun Rajitha, Dushmantha Chameera

భారత్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో పృథ్వీ షా, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టులో తన అనుభవాన్ని చాటుతున్నాడు. అలానే సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ గమానానికి అనుగుణంగా గేర్లు మారుస్తూ ఆకట్టుకున్నాడు. కానీ.. మనీశ్ పాండే ఒక్కడే మిడిలార్డర్‌లో కాస్త తడబడినట్లు కనిపించాడు. బౌలింగ్ పరంగా వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ వికెట్ పడగొట్టలేకపోయినా.. చివరి ఓవర్ మినహా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. ఇక స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చాహల్ మిడిల్ ఓవర్లలో శ్రీలంకని బాగా ఇబ్బందిపెట్టారు. అలానే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. ఇద్దరికీ తొలి వన్డేలో బ్యాటింగ్ ఛాన్స్ లభించలేదు. దాంతో.. రెండో వన్డేలో ఈ ఇద్దరిలో ఒకరికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

శ్రీలంక టీమ్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు చక్కగా ఇన్నింగ్స్‌ని ఆరంభించినా.. క్రీజులో సెటిలైన తర్వాత పేలవరీతిలో వికెట్లు చేజార్చుకున్నారు. దాంతో.. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ని చేరుకోలేకపోయారు. అలానే బౌలింగ్‌లో తొలుత పృథ్వీ షా దెబ్బకి లయ తప్పిన ఆ జట్టు బౌలర్లు.. ఆ తర్వాత ఇషాన్ కిషన్ జోరుతో ఢీలా పడిపోయి 15 ఓవర్లకే మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నారు. దాంతో.. రెండో వన్డేలో తప్పిదాలు దిద్దుకోవాలని ఆతిథ్య శ్రీలంక ఆశిస్తోంది. ఫస్ట్ వన్డేని కేవలం 37 ఓవర్లలోనే ముగించేసిన భారత్ జట్టుని ఓడించాలంటే శ్రీలంక ఆటతీరు మెరుగుపడాలి. జులై చివర్లో సాధారణంగా కొలంబోలో వర్షం పడుతుంటుంది. కానీ.. ఈరోజు మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదు.





Untitled Document
Advertisements