కొలంబో వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు స్పిన్నర్ యుజ్వేందర్. దాంతో.. 13.1 ఓవర్లు ముగిసే సమయానికి 77/0తో నిలిచిన శ్రీలంక.. రెండు బంతుల వ్యవధిలోనే 77/2తో ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన చాహల్.. ఓపెనర్ మినోద్ భానుక (36: 42 బంతుల్లో 6x4)ని రెండో బంతికి బోల్తా కొట్టించాడు. క్రీజు వెలుపలికి వెళ్లిన భానుక డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి మిడ్ వికెట్లోని మనీశ్ పాండే చేతుల్లో పడింది.