దౌత్యవేత్త కూతురు కిడ్నాప్...పాక్ పై భారత్, అఫ్గాన్ ఆగ్రహం

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 06:58 PM

దౌత్యవేత్త కూతురు కిడ్నాప్...పాక్ పై భారత్, అఫ్గాన్ ఆగ్రహం

పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త కుమార్తెను కిడ్నాప్ చేసి చిత్రహింసలు గురిచేసిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. దీనిపై భారత్, ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా స్పందించాయి. పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. ఓ దౌత్యవేత్త కుమార్తె కేసును ఇలాగేనా పర్యవేక్షించేది? అంటూ మండిపడ్డాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి మాట్లాడుతూ... భారత్ ఈ వ్యవహారంలో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తోందని అన్నారు. పాక్ హోంమంత్రి రషీద్ అహ్మద్ అనవసరంగా భారత్ ను ఈ వ్యవహారంలోకి లాగారని ఆరోపించారు. భారత నిఘా వర్గాల కుట్ర వల్లే ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగిందని రషీద్ అహ్మద్ అంటున్నారని, అందుకే తాము ఈ విషయంలో స్పందిస్తున్నామని ఆరిందమ్ బాగ్చి తెలిపారు. పాకిస్థాన్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అటు, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడింది. ఇస్లామాబాద్ లో ఆఫ్ఘన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్ జరిగినట్టు ఆధారాలు లేవని వ్యాఖ్యానించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి దారితీస్తాయని పేర్కొంది.





Untitled Document
Advertisements