మరో ఆటగాడికి గాయం...అల్రౌండర్ ఔట్

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 07:05 PM

మరో ఆటగాడికి గాయం...అల్రౌండర్ ఔట్

ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండగా.. గాయాలతో ముగ్గురు భారత క్రికెటర్లు సిరీస్‌కి దూరమయ్యారు. జంబో జట్టుని ఇంగ్లాండ్ టూర్‌కి పంపిన భారత సెలెక్టర్లు.. గాయపడిన ఆటగాళ్ల స్థానాల్ని భర్తీ చేసేందుకు ఎవరినీ అక్కడికి పంపేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తొలుత యువ ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడగా.. అతను ఇప్పటికే భారత్‌కి వచ్చేశాడు. ఆ తర్వాత టీమ్‌లో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ గాయపడ్డాడు. డర్హామ్ వేదికగా ప్రస్తుతం భారత్, కౌంటీ ఎలెవన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతుండగా.. కౌంటీ టీమ్‌లో ఆటగాళ్లు తక్కువగా ఉండటంతో.. ఆ టీమ్‌‌కి అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లు ఆడారు. ఈ క్రమంలో మంగళవారం అవేష్ ఖాన్ గాయపడి ఇంగ్లాండ్ టూర్‌కి దూరమవగా.. బుధవారం వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరికీ చేతి వేలికి గాయమైంది. ‘వాషింగ్టన్ సుందర్ గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం ఆరు వారాలు ఆటకి దూరంగా ఉండాలని సూచించారు. కాబట్టి.. అతను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమవడం లాంఛనమే’’ అని టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీతో తెలిపారు.





Untitled Document
Advertisements