కరోన భయం...15 నెలలుగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 08:12 PM

కరోన భయం...15 నెలలుగా  ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు

కరోన భయంతో ఓ కుటుంబం ఏకంగా 15 నెలలుగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు. పొరుగు ఇంట్లో ఒకరు కరోనా వల్ల చనిపోయారని తెలుసుకొన్న వాళ్లు తామ ప్రాణాలు కూడా పోతాయనే భయంతో ఇంట్లోనే ఉండిపోయారు. చిన్న గుడిసెలోనే ఉంటూ కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటకు రాలేదు. మలమూత్రాలకూ ఆ రూమ్‌లోనే వెళ్లేవాళ్లు. ఇంతటి దుర్భరంగా జీవితం గడుపుతున్న ఆ కుటుంబాన్ని విలేజ్‌ వాలంటీర్‌‌ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రెండ్రోజుల క్రితం గ్రామ సర్పంచ్, పోలీసులు కలిసి వారిని బయటికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడలిలో జరిగింది. ఆ కుటుంబానికి ఇంటి పట్టా వచ్చిందని వాలంటీర్ వెళ్లాడు. కడలి గ్రామంలోని జాన్ బెన్నీ (50) అనే వ్యక్తి, భార్య, ఇద్దరు కూమార్తెలు అనుసరిస్తున్న స్టే హోం.. స్టే సేఫ్ విషయం తెలిసింది. 15 నెలలుగా ఒక పరదాతో కప్పిన చిన్న గుడిసెలో ఉండిపోయారు.

‘‘గతంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఆ ఇంటికి హెల్త్ సర్వేలో భాగంగా వెళ్లినప్పటికీ రోజుల కొద్దీ ఎవరూ లేనట్టుగా అనిపించడంతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఉచిత ఇంటి పట్టా వచ్చింది. దానికి సంబంధించి బయోమెట్రిక్ కోసం విలేజ్ వాలంటీర్ వాళ్ల ఇంటికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది’’ ఆ గ్రామ సర్పంచ్ చొప్పల గురునాథం చెప్పారు.

విలేజ్ వాలంటీర్ ఆ ఇంటికి వెళ్లినప్పుడు లోపల ఎవరో ఉన్నట్టుగా అలికిడి వినిపించడంతో జాన్‌ బెన్నీని పిలిచాడని, బయటకు వస్తే కరోనా చచ్చిపోతామంటూ వచ్చేందుకు నిరాకరించడంతో వాలంటీర్ వచ్చి తమకు సమాచారం ఇచ్చాడని తెలిపారు. వాలంటీర్ సమాచారం ఇవ్వడంతో పోలీసులను తీసుకుని ఆ ఇంటి దగ్గరకు వెళ్లామని, ఎట్టకేలకు జాన్ బెన్నీ సహా ఆ కుటుంబం మొత్తాన్ని బయటకు రప్పించామని గురునాథం చెప్పాడు.

అయితే ఇంట్లో సరుకులు లాంటి వాటికి జాన్‌ మాత్రమే ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లి వచ్చేవాడని, మిగతా వాళ్లంతా అడుగు బయటపెట్టలేదని అన్నారు. కనీసం మలమూత్రాల అవసరాలనూ ఆ ఇంటి లోపలే తీర్చుకున్నారని చెప్పారు.





Untitled Document
Advertisements