తక్షకుడు ఇతడొక రాజు. కద్రువ వల్ల కశ్యపునికు జన్మించిన సర్పం. కద్రువ వినతల పందెంలో వినతను ఓడించడానికి తన కుమారులైన సర్పాలను మోసానికి పాల్పడమంటుంది కద్రువ. అందుకు కొంత మంది పుత్రులు అంగీకరించరు. ఆమె మాటను తిరస్కరించిన వారు ఆమె నుండి విడిపోయి వెళతారు. అలా వెళ్ళిపోయినా సర్పాలకు నాయకుడు తక్షకుడు. కద్రువ వారిని జనమేజయుని సర్పయాగంలో భస్మం కమ్మని శపిస్తుంది. శృంగి శాపం వలన పరీక్షిత్తు మహారాజు ఎడురోజులలో తక్షకుని కాటుకు మరణించాలి. ఈ శాపం విన్న పరీక్షిత్తు ఏడంతస్తుల భవనంలో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకొని ఉంటాడు. ఎంతో మంది బ్రాహ్మణులు, వైద్యులు పరీక్షిత్తును రక్షించడానికి సిద్దంగా ఉన్నారు. అతణ్ణి నిరోధించడానికి కాశ్యపుడనే బ్రాహ్మణ వైద్యుడు, అతని కరవడానికి బ్రాహ్మణ వేషంలో వున్న తక్షకుడు ప్రయాణంలో కలుస్తారు. ఒకర్నొకరు పరిచయం చేసుకుని వారి శక్తిని పరీక్షించుకుంటారు. తక్షకుడు ఓ చెట్టును తన కాటుతో నశింపజేయగా కాశ్యపుడు దాన్ని తన వైద్య ప్రావీణ్యంతో బ్రతికిస్తాడు. ఇతడుండగా తన కార్యం సాధ్యం కాదని అతడికున్న ధనాశగ్రహించి కావలసిన దానం ఇచ్చి వెనక్కు పంపుతాడు. ఆరురోజులు గడిచాయి. ఎడవరోజు వచ్చింది. తక్షకుడు తన తోటి వారితో వచ్చి భవనమంతా రక్షణ వలయంలో ఉండడం చూసి అతడు, అతని మిత్రులు బ్రాహ్మణ వేషం ధరించి రాజును చూడగోరుతారు. రాజభటులు వారిని ఆపి పరీక్షిత్తుకు విషయం చెప్పగా వారిచ్చిన ఫలాలు పంపమని వారిని మరుసటిరోజు కలవమని చెప్తాడు. తక్షకుడు ఆ పండ్లలో అన్నిటికంటే అందమైన దానిలో పురుగుగా ప్రవేశిస్తాడు. పరీక్షిత్తు ఎడవరోజు సాయంత్రం ఆ ఫలాలన్నీ తన మంత్రులకు తల ఒకటి ఇచ్చి అందమైన ఫలాన్ని తను తీసుకుని కొరకగా ఆ పండు నుండి పురుగు కనిపిస్తుంది. పరీక్షిత్తు బ్రాహ్మణుని శాపం వృధా కారాదని ఆ పురుగును తన కంఠంపై వుంచుకోగా అందుండి తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్తును కాటువేయగా మరణించాడు.