అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండడంతో అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుని వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అనేక ప్రాంతాల్లో తాలిబన్లకు అఫ్ఘాన్ సైన్యం కూడా భయపడిపోతోంది. అయితే, తాలిబన్ల చర్యలను నిశితంగా పరిశీలిస్తోన్న అఫ్ఘాన్ దళాలు అదును చూసి ఒక్కసారిగా దాడి చేయడంతో 30 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 17 మంది ఉగ్రవాదులకు తీవ్రగాయాలయ్యాయి.
తాలిబన్లపై వైమానిక దాడులు చేయడంతో వారు హతమయ్యారని అఫ్ఘాన్ అధికారులు ప్రకటించారు. హతమైన 30 మంది తాలిబన్లలో 19 మంది షిబెర్ఘాన్ శివారులోని ముర్ఘాబ్, హాసన్ తాబ్బిన్ గ్రామాల్లో జరిపిన దాడుల్లో మరణించారని వివరించారు.
అలాగే, మిగతావారు లాష్కర్ ఘాహ్ శివారులో హతమయ్యారని చెప్పారు. వారిలో ఇద్దరు అఫ్ఘానిస్థానేతర ఉగ్రవాదులు ఉన్నారని చెప్పారు. ఆ ప్రాంతాల్లోనే కొందరికి గాయాలయ్యాయని, వారిలోనూ ఇద్దరు అఫ్ఘానిస్థానేతర ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు.
ప్రాంతాల్లో ఉగ్రవాదుల వాహనాలు, రెండు బంకర్లు, పెద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేశామని చెప్పారు. కాగా, తాలిబన్ ఉగ్రవాదులు ఇప్పటికేఈ 419 జిల్లాల కేంద్రాను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని అధికారుల చెప్పారు.