చివరి వన్డేలో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 03:06 PM

చివరి వన్డేలో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు

శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్ జట్టు ఎవరూ ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూసింది. ఆరు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తేలిపోయింది. దాంతో.. 3 వికెట్ల తేడాతో గెలుపొందిన శ్రీలంక.. సొంతగడ్డపై 1-2తో వైట్‌వాష్‌ని తప్పించుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా పేలవరీతిలో 225 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని లంకేయులు 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించారు. వాస్తవానికి ఛేదనలో శ్రీలంక కూడా తడబడింది. కానీ.. వరుస ఫీల్డింగ్ తప్పిదాలకి పాల్పడిన భారత్.. మ్యాచ్‌లో పుంజుకోలేకపోయింది. ఎంతలా అంటే.. మ్యాచ్‌లో ఏకంగా ఐదు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఇందులో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఛేదనలో లంకని నడిపించిన భానుక రాజపక్సె (65: 56 బంతుల్లో 12x4) క్యాచ్‌ని తొలుత శిఖర్ ధావన్, ఆ తర్వాత చేతన్ సకారియా, నితీశ్ రాణా నేలపాలు చేశారు. ఇక ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (76: 98 బంతుల్లో 4x4, 1x6) ఇచ్చిన సులువైన క్యాచ్‌ని మనీశ్ పాండే జారవిడచగా.. చివర్లో రమేశ్ మెండిస్ క్యాచ్‌ని స్లిప్‌లో పృథ్వీ షా వదిలేశాడు. వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా తప్పిదాలకి పాల్పడ్డాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన సంజు శాంసన్.. రాజపక్సెని స్టంపౌట్ చేయలేకపోయాడు. బంతిని హిట్ చేసేందుకు క్రీజు వెలుపలికి రాజపక్సెరాగా.. రాహుల్ చాహర్ లెగ్ స్టంప్‌ లైన్‌పై బంతిని టర్న్ చేశాడు. కానీ.. అప్పటికే ఆఫ్ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లిపోయిన సంజు శాంసన్.. ఆ బంతిని కనీసం అడ్డుకోలేకపోయాడు. దాంతో.. అది నేరుగా వెళ్లి బౌండరీ లైన్‌కి తాకింది.







Untitled Document
Advertisements