ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే!

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 07:07 PM

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే!

ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనేనని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 23, 300 ఏలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్ కర్మచారి యూనియన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు ఈ విషయాన్ని గుర్తు చేసింది. వీరంతా కార్మికులు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులే.. అత్యున్నత స్థాయికి చెందినవారు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీరిని కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేశాయని మండిపడింది. ఉద్యోగుల నెలవారీ జీతాలను చెల్లించకపోవడం ఆర్టికల్ 21, 23, 300-ఏలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కపిల హింగోరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. తన ఉద్యోగుల ప్రాథమిక, మానవ హక్కులను ఉల్లంఘించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించరాదని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోజాలదని ఉద్ఘాటించింది. జీతాల చెల్లింపు బాధ్యత కార్పొరేషన్‌దేనని పేర్కొన్న హైకోర్టు.. ఆకు చాటున దాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించరాదని చురకలంటించింది. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఉద్యోగులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేతనాలను చెల్లించలేదు. దీంతో ఉద్యోగులంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై న్యాయస్థానం ఆదేశాలతో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సెక్రెటరీ రజింత్ కుమార్ సిన్హా అఫిడ్‌విట్ దాఖలు చేశారు. వేతనాల కోసం రూ.23 కోట్లు విడుదల చేశామని, శాశ్వత ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలు, కాంట్రాక్ట్ సిబ్బందికి మార్చి జీతాలు చెల్లించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా కంటిన్‌జెన్సీ ఫండ్స్ కింద కార్పొరేషన్‌కు రూ.34 కోట్ల మంజూరు చేశారని వివరించారు. ఈ నిధులతో శాశ్వత, ఒప్పంద ఉద్యోగుల మార్చి, ఏప్రిల్ వేతనాలను చెల్లిస్తామని ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ అభిషేక్ రోహిలా తెలిపారు. అయితే, రాబోయే నెలల్లో ఉద్యోగులకు 50 శాతం జీతాలను చెల్లించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి చర్య చట్టబద్ధత గురించి రాష్ట్రాన్ని ప్రశ్నించింది.





Untitled Document
Advertisements