కేసు పెట్టేందుకు నిక్కర్లపై వెళ్లిన యువకులు...వెనక్కి పంపిన పోలీసులు

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 08:08 PM

కేసు పెట్టేందుకు నిక్కర్లపై వెళ్లిన యువకులు...వెనక్కి పంపిన పోలీసులు

కోల్ కతాలో ఆసక్తికర సంఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు. అందుకు కారణం... వారిద్దరూ జిమ్ లో ధరించే నిక్కర్లు (షార్ట్స్) వేసుకుని ఉండడమే. ఇటీవల కోల్ కతాలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వారిద్దరూ ఈ నెల 17న కోల్ కతాలోని కస్బా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, పోలీసుల వారి నుంచి ఫిర్యాదును స్వీకరించలేదు.

"మీరు షార్ట్ లు ధరించి వచ్చారు... లోపల స్టేషన్ లో మహిళా పోలీసులు ఉన్నారు. మిమ్మల్ని లోపలికి అనుమతించలేం" అని పోలీసులు వారికి స్పష్టం చేశారు. ప్యాంట్లు వేసుకుని రావాలని దత్తా, అవిషేక్ లకు పోలీసులు సూచించారు. వారు చెప్పినట్టే ప్యాంట్లు వేసుకుని వస్తే, అప్పుడు పీఎస్ లోపలికి అనుమతించడమే కాకుండా, వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు.

ఈ వ్యవహారంలో పోలీసుల తీరును వివరిస్తూ ఆ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. డ్రెస్ కోడ్ ఏదైనా ఉందా? అని వారు ప్రశ్నించారు. దాంతో కోల్ కతా పోలీసులు దీటుగా స్పందించారు. మీ కార్యాలయాలకు మీరు షార్ట్ లపైనా వెళతారా? అని తిరిగి ప్రశ్నించారు.





Untitled Document
Advertisements