టీ20 సిరీస్‌లోనూ టీమిండియా బోణి

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 10:49 AM

టీ20 సిరీస్‌లోనూ టీమిండియా బోణి

శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్‌లోనూ టీమిండియా బోణి కొట్టింది. కొలంబో వేదికగా ఆదివారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 38 పరుగుల తేడాతో శ్రీలంకని ఓడించింది. మొదట సూర్యకుమార్ యాదవ్ (50: 34 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం భువనేశ్వర్ కుమార్ (4/22), దీపక్ చాహర్ (2/24) చెలరేగడంతో శ్రీలంక జట్టుని ఛేదనలో 126 పరుగులకే కుప్పకూల్చింది. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 మ్యాచ్ కొలంబో వేదికగానే మంగళవారం రాత్రి 8 గంటలకి ప్రారంభంకానుంది.

165 పరుగుల లక్ష్యఛేదనని శ్రీలంక పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు మినోద్ భానుక (10: 7 బంతుల్లో 2x4), అవిష్కా ఫెర్నాండో (26: 23 బంతుల్లో 3x4) తక్కువ స్కోర్లకే వికెట్లు చేజార్చుకోగా.. మూడో స్థానంలో వచ్చిన ధనంజయ డిసిల్వా (9: 10 బంతుల్లో 1x4) కూడా ఫెయిలయ్యాడు. కానీ.. చరిత అసలంక (44: 26 బంతుల్లో 3x4, 3x6) కాసేపు దూకుడుగా ఆడి శ్రీలంక శిబిరంలో గెలుపు ఆశలు రేపాడు. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని అతను సిక్సర్లు బాదేశాడు. కానీ.. అతనికి మిడిలార్డర్‌లో సపోర్ట్‌ కరవైంది. ప్రమాదకరంగా మారిన అసలంకని ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఔట్ చేసిన దీపక్ చాహర్.. అదే ఓవర్‌లో హసరంగా(0)ని క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ని భారత్‌ వైపు తిప్పాడు.

అప్పటికే అసేన్ బంద్రా (9: 19 బంతుల్లో) కొన్ని బంతుల్ని వేస్ట్ చేసేయగా.. కెప్టెన్ దసున్ షనక (16: 14 బంతుల్లో 1x6).. భువీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం మినహా చెప్పుకోదగ్గ షాట్‌లు ఏమీ ఆడలేదు. ఇక చివర్లో కరుణరత్నె (3), ఇసుర ఉదాన (1)తో పాటు చమీరా (1)లను ఔట్ చేసేసిన భువనేశ్వర్ కుమార్ 18.3 ఓవర్లలోనే శ్రీలంక ఇన్నింగ్స్‌కి ముగింపు పలికేశాడు. స్పిన్నర్లు కృనాల్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, చాహల్ తలో వికెట్ పడగొట్టగా.. హార్దిక్ పాండ్యాకి కూడా ఓ వికెట్ దక్కింది. మొత్తంగా ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా.. అందరికీ వికెట్లు పడటం గమనార్హం. శ్రీలంక చివర్లో కేవలం 15 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు చేజార్చుకుంది.





Untitled Document
Advertisements