దధీచి ఒక మహర్షి, చ్యవన మహర్షి కుమారుడు. ప్రపంచ సారం పెద్ద శరీరంలోకి నింపబడినవాడు దధీచి. ఇతని భార్య సువర్చ. సారస్వతము అను తీర్థమున ఓ కుటీరం నిర్మించుకొని దధీచి తపస్సు చేస్తుండగా, అతని తపశ్శక్తి రోజు రోజుకు పెరగడం చూచి ఇంద్రుడు సహించలేక అలంబుస అనే అప్సర కన్యను ఇతని ఆశ్రమానికి పంపాడు. ఆమె తన ఆటపాటలతో కవ్వించగా దధీచికి వీర్యస్కలనమై సరస్వతీ నదిలో పడి, ఒక బిడ్డ జన్మకు కారణమయ్యాడు. అతడే సారస్వతుడు. ఒకసారి ఇతడు దేవలోకం వెళ్లి ఇంద్రుడితో పాటు భూమండలం మీదకు చూడగా భూమంతా రాక్షసులతో నిండి ఉన్నది. ఇంద్రుడు వారిని చంపడానికి ప్రయత్నించి విఫలుడై దధీచి వేనుకనున్న గొర్రె పుర్రెలోని ఎముకతో భూమిపై గల అసురుల్ని వధించాడు. వృతాసురుని నాయకత్వంలో అసురులు ఇంద్రునిపై యుద్దానికి రాగా ఇంద్రుడు వారిని జయించలేక బ్రహ్మనాశ్రయించగా దధీచి ఎముకలతో చేసిన ఆయుధం అతన్ని చంపగలడని చెప్తాడు. ఇంద్రుడు నరనారాయణులతో కలిసి దధీచిని కలిసి వివరించగా అసురులను చంపడానికి తన అంగీకారం తెలిపి శరీరాన్ని వదలివేస్తాడు. ఆవిధంగా అతడి ఎముకల నుండే ఇంద్రుని వజ్రాయుధం చేయబడింది. దీనితో ఇంద్రుడు వృతాసురున్ని వధించాడు.