ద్వారక శ్రీకృష్ణుని రాజధాని నగరం. మగధ రాజైన జరాసంధుడు యాదవులకు శత్రువు. వాని నుండి రక్షించుకొనుటకు యాదవులంతా శ్రీకృష్ణుని నాయకత్వంలో సముద్రంలో పశ్చమతీరాన ఓ అందమైన నగరాన్ని నిర్మించుకున్నారు. అదే ద్వారక. దాన్ని కుశస్థలి అని కుడా అంటారు. రైవతక పర్వతాలు కోటలా ఈ పట్టణాన్ని రక్షిస్తాయి. రైవతం 3 యోజనాల పొడవుంటుంది. ప్రతి యోజనంలో 3 విభాగాల సైన్యం, ప్రతి యోజనానికి 100 తలుపులు వాటికి బలమైన రక్షక భటులు ఉండేవారు. దీనిని విశ్వకర్మ నిర్మించారు. నగరానికి తూర్పున ఒక కొలను నగరంలో నాలుగు ఉద్యానవనాలైన నందన మిశ్రమక చైత్రరథ వైభ్రాజాలున్నాయి. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకను సందర్శించాడు. సాళ్యుడు ఈ నగరం పై దాడిచేసి పారి పోయాడు. ఇక్కడే ఇనుప రోకలి (ముసలం) పుట్టి యాదవ వంశ నాశనానికి కారణమయ్యింది. శ్రీ కృష్ణుని నిర్యాణం తర్వాత ఈ నగరాన్ని సముద్రం ముంచి వేసింది. గుజరాత్ కి పశ్చిమాన సముద్రపు ఒడ్డున చిన్న ప్రాంతం ఒకటి ఉంది. దాన్ని ద్వారక అని పిలుస్తారు. అక్కడి ప్రజలు ఎప్పటికి పాడి పరిశ్రమను జీవనాధారంగా చేసుకొని వున్నారు. వారు తాము శ్రీకృష్ణుని వారసులమని చెప్తారు.