దుర్గముడు ఇతడు హిరణ్యాక్షుని వంశంలోని ఒక రాక్షస రాజు. తరుణి కుమారుడు. ఇతడు పుట్టినప్పటి నుండి దేవతలకు వ్యతిరేకి. అయితే దేవతల బలమంతా వేదాలలో వుందని వేదాలు లేకుంటే యజ్ఞాలు లేవని, యజ్ఞమే లేకుంటే వారికి యజ్ఞఫలంలో భాగం ఉండదని నమ్మి ఆహారం, నీళ్ళు మాని హిమాలయాలకు వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాగా, బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలు, మంత్రాలకు సంబంధించిన గణాలు కావాలని, దేవతలందర్నీ ఓడించే బలం కావాలని కోరగా బ్రహ్మ అనుగ్రహించాడు. దేవతలకు యజ్ఞాలు లేవు, హోమాలు లేవు. దుర్గముడు దేవతలను దేవలోకం నుండి పారద్రోలగా గుహల్లో దాక్కున్నారు. 100 సంవత్సరాల్లో లోకమంతా నాశనం అయ్యింది. బ్రాహ్మణులు హిమాలయాలలోని జగదాంబిక వద్దకు వెళ్ళి తమ బాధలు గాధలు కన్నీటితో చెప్పుకోగా అంబికకు కన్నీళ్లు వచ్చాయి. దానితో నీటి కొరత తీరిపోయింది. అంబిక వారికి ఆహారంగా కూరగాయలు ఇచ్చింది. అందుకే ఆమెను శాకాంబరి అని అంటారు. ఆమె కంటి నుండి నీరు కారడం వలన ఆమెను శాతాక్షి అని పిలిచేవారు. ఈమె గురించి తెలుసుకున్న దుర్గముడు జగదాంబిక పై దండెత్తాడు. అప్పుడు దేవి శరీరం నుండి ఎన్నో శక్తులు ఆవిర్భవించి ధరణి, బాల, త్రిపుర, భైరవి, కాళి ఒక్కొక్కరు 10,000 చేతులతో దుర్గముడితో యుద్ధం చేయగా అతని సైన్యం నశించింది. చివరికి దేవి స్వయంగా ఒకేసారి 15 బాణాలను అతనిపై సంధించి అతన్ని చంపివేసింది.