కురుపాండవుల విలువిద్య ప్రదర్శన సమయమున కవచకుండలధారియైన కర్ణుడు మత్తగజంలా అడుగులు వేస్తూ, రంగస్థలం మధ్యకు వచ్చి అర్జునుని శక్తిని ఆక్షేపించి, ద్రోణ కృపాచార్యుల అనుమతి పొంది " అర్జునా నీవు చూపిన ఈ విద్యలన్నీ నేను ప్రదర్శించగలను " అని అర్జునుడు చూపించిన అస్త్ర విద్యలనన్నింటినీ చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలన్ని పొందాడు. తరువాత " ఇంతకన్నా ఇంకా గొప్ప విద్యలు నా దగ్గర ఉన్నవి" అంటుండగా దుర్యోధనుడు తన సోదరులతో వచ్చి, కర్ణుని కౌగిలించుకొని మెచ్చుకున్నాడు. " ప్రియతమా! కర్ణా! మీ రాక మాకు చాలా సంతోషంగా ఉన్నాది. మా స్నేహితుడవై రాజభోగాలన్నీ మాతో అనుభవించు " అన్నాడు.
తరువాత కర్ణుడు అర్జునుని తనతో ద్వంద్వ యుద్దము చేయమని సవాలు చేయగా, అర్జునుడు కర్ణునితో యుద్దము చేయుటకు తలపడ్డాడు. ప్రదర్శనను తిలికిస్తున్న కుంతి భయంతో మూర్చపోయింది. అంత కృపాచార్యుడు వారి యుద్దమును ఆపుచేయించి రాజవంశజుడైన అర్జునునితో సూతకులస్థూడైన కర్ణుడు ద్వంద్వ యుద్దము చేయుటకు అర్హుడు కాడని చెప్పినాడు.
ఈ మాటకు దుర్యోధనుడు కోపోద్రిక్తుడై పాండవుల నోడించుటకు తనకు కర్ణుని స్నేహము అవసరమని భావించి, క్రుపాచార్యునితో "గురుదేవా! కర్ణుడు రాజు కాకపోవుటచేతనే కదా మీరు అభ్యంతరము పెట్టుచున్నది? రాజ్యము సేలువాడు ఎటువంటి వాడయినా రాజేకదా? అని ధృతరాష్ట్రుని అనుమతిని తీసుకొని అప్పటికప్పుడు కర్ణుని అంగరాజ్యాదిపతిగా అభిషేకించాడు.
దుర్యుధనుడు తనకు చేసిన మహోపకారమునకు ఆశ్చర్యం చెంది కర్ణుడు ఆ సంతోషముతో రాజా! నీవు నాకు కలుగజేసిన ఈ గౌరవమునకు ప్రత్యుపకారముగా ఏమివ్వగలను" అనగా ' నీవంటి బాల పరాక్రమవంతుడు నా జీవితమంతా స్నేహితునిగా ఉండాలనే నా కోరిక. కనుక నీవు నా స్నేహితునిగా ఉండుటయే నాకు చేయగల ప్రత్యుపకారం' అని దుర్యోధనుడు సమాధానమిచ్చాడు. దానితో ఆనాటి సభ మిగిసింది.