ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కి రూ.24 లక్షల జరిమానా పడింది. ముంబయి ఇండియన్స్తో అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ గెలుపొందింది. కానీ.. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి కోల్కతా నైట్రైడర్స్ పాల్పడగా.. కెప్టెన్ మోర్గాన్కి రూ.24 లక్షలు, టీమ్లోని ఆటగాళ్లకి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత (ఏది తక్కువ ఉంటే అది) పడింది. ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా ఇలా స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి. దాంతో.. జరిమానా రెట్టింపైంది.
మ్యాచ్లో డికాక్ హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత.. కోల్కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో.. ఆ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3తో విజయాన్ని అందుకుంది. సీజన్లో 9వ మ్యాచ్ ఆడిన కోల్కతా టీమ్కి ఇది నాలుగో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్కి ఇది ఐదో ఓటమి.
గురువారం రాత్రి కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్ని తక్కువగా వేసింది. దాంతో.. ఆ జట్టుకి జరిమానా పడింది. వాస్తవానికి సీజన్లో మొదటి తప్పిదానికి కెప్టెన్కి రూ. 12 లక్షల జరిమానా పడనుండగా.. రెండో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదం చేస్తే.. ఆ జరిమానా రెట్టింపుకానుంది.