రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ : నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

     Written by : smtv Desk | Sun, Sep 26, 2021, 12:05 PM

రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్  : నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటే చిత్ర పరిశ్రమ దారికొస్తుందని భావిస్తున్నారని ఆరోపించారు. కానీ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు.

"నటులు, దర్శకులు కోట్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ సినిమా వాళ్లు ఎవరినీ దోచుకుని సంపాదించడంలేదు. తప్పుడు విధానాల్లో దోపిడీలు చేయడంలేదు. మేం డ్యాన్సులు చేసో, కిందపడో, మీదపడో, అవి ఇవీ విరగ్గొట్టుకునో, లేకపోతే బాహుబలిలో ప్రభాస్, రానా గార్ల లాగా కండలు పెంచి ఎంతో కష్టపడితేనే మాకు డబ్బులు వస్తున్నాయి. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు ఒక్క రోజులో డబ్బులు రావడంలేదు... రామ్ చరణ్ వంటి హీరో అద్భుతమైన రీతిలో స్వారీ చేస్తే అప్పుడు వస్తాయి డబ్బులు! అంతేతప్ప అక్రమ కాంట్రాక్టులతో అడ్డగోలుగా సంపాదించడంలేదు.

హీరోయిన్లు ఎక్కడ్నించో వేరే దేశం నుంచో, వేరే రాష్ట్రం నుంచో వచ్చి, ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పడుతూ నటించి డబ్బులు తీసుకుంటే ఆమెను ఎందుకు తప్పుబడతారు? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. దయచేసి ఎవరూ తెగేవరకు లాగొద్దని హితవు పలికారు. దిల్ రాజు వంటి వారికి థియేటర్లు ఉండడం తప్పేముంది? ఒక్కసారి ఎలక్షన్లలో గెలిచి 30 ఏళ్లు అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నప్పుడు వ్యాపారాలు చేసుకునేవారికి కోరికలు ఉండవా? అని నిలదీశారు.

ఇటీవల ప్రకాశ్ రాజ్ ను కొందరు అవుట్ సైడర్ అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్, నాన్ లోకల్ అంటూ వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రకాశ్ రాజ్ తనకు ఫ్రెండేమీ కాదని, కానీ ఆయనను నాన్ లోకల్ అనడం బాధించిందని పేర్కొన్నారు. ఓసారి ప్రకాశ్ రాజ్ తనను విమర్శించారని, కానీ అది రాజకీయాల వరకేనని, సినిమాల్లో అందరం కలిసే ఉంటామని స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements