పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన MI

     Written by : smtv Desk | Wed, Sep 29, 2021, 11:15 AM

పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన MI

ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ మళ్లీ పుంజుకుంది. పంజాబ్ కింగ్స్‌తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో సత్తాచాటిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్ ఝళిపించిన హార్దిక్ పాండ్యా (40 నాటౌట్: 30 బంతుల్లో 4x4, 2x6).. ముంబయి ఇండియన్స్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. తాజా సీజన్‌లో 11వ మ్యాచ్ ఆడిన ముంబయి టీమ్‌కి ఇది ఐదో గెలుపుకాగా.. పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఏడో ఓటమిని చవిచూసిన పంజాబ్.. ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.

136 పరుగుల ఛేదనలో ముంబయికి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ డికాక్ (27: 29 బంతుల్లో 2x4) కాస్త ఓపికగా ఆడినా.. కెప్టెన్ రోహిత్ శర్మ (8: 10 బంతుల్లో 1x4) ఫస్ట్‌లోనే వికెట్ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో ముంబయి ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. కానీ.. డికాక్‌తో కలిసి నిలకడగా ఆడిన సౌరభ్ తివారి (45: 37 బంతుల్లో 3x4, 2x6).. ముంబయి టీమ్ స్కోరు 92 వద్ద ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ దాదాపు ముంబయి చేతుల్లోకి వచ్చేయగా.. ఆ తర్వాత కీరన్ పొలార్డ్ (15 నాటౌట్: 7 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి హార్దిక్ పాండ్యా మరో 6 బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. మన్‌‌దీప్ సింగ్ (15: 14 బంతుల్లో 2x4) కలిసి పంజాబ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కేఎల్ రాహుల్.. అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఓవర్ వ్యవధిలోనే మన్‌దీప్, రాహుల్‌తో పాటు క్రిస్‌గేల్ (1) కూడా పెవిలియన్‌కి చేరిపోగా.. నికోలస్ పూరన్ (2) పేలవ ఫామ్‌‌ని కొనసాగించాడు. దాంతో.. ఒకానొక దశలో 48/4తో నిలిచిన పంజాబ్.. కనీసం 100 పరుగలైనా చేస్తుందా..? అనే సందేహం కలిగింది. కానీ.. దీపక్ హుడా (28: 26 బంతుల్లో 1x4, 1x6) కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన మర్‌క్రమ్ (42: 29 బంతుల్లో 6x4).. ఐదో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ గేర్ మార్చి వరుస బౌండరీలు బాదింది. కానీ.. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రాహుల్ చాహర్.. మర్‌క్రమ్‌ని ఔట్ చేసేయగా.. దీపక్ హుడాని బుమ్రా బోల్తా కొట్టించాడు. చివర్లో హర్‌ప్రీత్ బరార్ (14: 19 బంతుల్లో) వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో.. పంజాబ్ 135/6తో సరిపెట్టుకోక తప్పలేదు. ముంబయి బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ రెండేసి వికెట్లు, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు.





Untitled Document
Advertisements