రాజస్థాన్‌పై గెలిచిన బెంగళూరు టీమ్...మరోసారి RCB ఆల్‌రౌండర్ షో

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:00 PM

రాజస్థాన్‌పై గెలిచిన బెంగళూరు టీమ్...మరోసారి RCB ఆల్‌రౌండర్ షో

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్.. ఓపెనర్ ఎవిన్ లావిస్ (58: 37 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీ బాదడంతో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (44: 35 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో గ్లెన్ మాక్స్‌వెల్ (50 నాటౌట్: 30 బంతుల్లో 6x4, 1x6) దూకుడుగా ఆడేసి 17.1 ఓవర్లలోనే 153/3తో బెంగళూరుని గెలిపించాడు. సీజన్‌లో 11వ మ్యాచ్ ఆడిన బెంగళూరు టీమ్‌కి ఇది ఏడో గెలుపుకాగా.. 14 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్‌కి మరింత చేరువైంది. మరోవైపు 11వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌ ఏడో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చుకుంది. 150 పరుగుల ఛేదనలో దూకుడుగా ఆడేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (25: 20 బంతుల్లో 4x4), దేవదత్ పడిక్కల్ (22: 17 బంతుల్లో 4x4).. తొలి వికెట్‌కి 5.2 ఓవర్లలోనే 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. ఓవర్ వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటవగా.. అనంతరం వచ్చిన మాక్స్‌వెల్‌తో కలిసి సమయోచితంగా ఆడిన కేఎస్ భరత్.. మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భరత్‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్ తన నోటికి పనిచెప్పినా.. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో వారికి సమాధానం చెప్పిన భరత్.. టీమ్ స్కోరు 127 వద్ద ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వచ్చేయగా.. చివర్లో మాక్స్‌వెల్ టాప్‌గేర్‌లోకి వెళ్లి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు ఎవిన్ లావిస్, యశస్వి జైశ్వాల్ (31: 22 బంతుల్లో 3x4, 2x6) పోటీపడి బౌండరీలు బాదేశారు. దాంతో.. తొలి వికెట్‌కి 8.2 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. టీమ్ భారీ స్కోరుకి బాటలు వేసింది. కానీ.. యశస్విని క్రిస్టియాన్ ఔట్ చేయగా.. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా కనిపించిన లావిస్‌ని గార్టన్ బోల్తా కొట్టించాడు. అప్పటికి రాజస్థాన్ 11.1 ఓవర్లలో 100/2తో నిలవగా.. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలైంది. వరుస ఓవర్లలో సంజు శాంసన్ (19), లోమ్‌రర్ (3), లివింగ్‌స్టోన్ (6), రాహుల్ తెవాటియా (2), రియాన్ పరాగ్ (9), చేతన్ సకారియా (2), క్రిస్ మోరీస్ (14) వికెట్లు చేజార్చుకున్నారు. దాంతో.. 149 పరుగులతోనే ఆ జట్టు సరిపెట్టుకుంది. ఆర్సీబీ స్పిన్నర్లు షబాజ్ అహ్మద్ (2/10), చాహల్ (2/18) వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి రాజస్థాన్ జోరుకి కళ్లెం వేయగా.. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్ (3/34) మూడు వికెట్లు పడగొట్టేశాడు.






Untitled Document
Advertisements