పాకిస్థాన్ కుట్రలని బయటపెట్టిన ఉగ్రవాది

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:15 PM

పాకిస్థాన్ కుట్రలని బయటపెట్టిన ఉగ్రవాది

రెండు రోజుల కిందట కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించి, ఉరి సెక్టార్ వద్ద సైన్యానికి చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది అలీ బాబర్‌ పత్రా (19) సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాకిస్థాన్‌కు చెందిన పౌరుడ్నినని, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తనకు శిక్షణ ఇచ్చినట్టు అంగీకరించాడు. ఉరి సెక్టార్‌ వద్ద మరి కొందరితో కలిసి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా.. అలీ బాబర్ పాత్రాను భారత సైన్యానికి పట్టుబడ్డాడు. తన కుటుంబ నేపథ్యం, ఉగ్రవాద శిక్షణ పొందడానికి దారితీసిన పరిస్థితులపై ఉరి సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపులో మీడియాతో మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను సైన్యం బుధవారం విడుదల చేసింది. తన స్వస్థలం పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లోని ఒకరాగా పేర్కొన్నాడు. తమది నిరుపేద కుటుంబమని, తండ్రిలేడని తెలిపాడు. జీవనోపాధికోసం స్థానికంగా ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేసే సమయంలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ‌తో సంబంధాలున్న యువకుడితో పరిచయం ఏర్పడినట్టు చెప్పాడు. డబ్బుకు ఆశపడి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరానని, అప్పుడు తనకు రూ.20వేలు ఇచ్చారని వెల్లడించాడు. ‘‘నాది పాకిస్థాన్ పంజాబ్‌ ప్రాంతానికి చెందిన ఒకారా. మాది పేద కుటుంబం. తండ్రి లేడు.. వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. ఆ సమయంలో ఐఎస్‌ఐతో సంబంధాలున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. డబ్బుకి ఆశపడి అతడితో పాటు లష్కరే తొయిబాలో చేరాను. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.. ఆ సమయంలో నాకు వాళ్లు రూ.20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత మరో రూ.30 వేలు ఇస్తామన్నారు.. తర్వాత నన్ను పాకిస్థాన్‌ ఆర్మీ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పినట్టు నేను, మరికొందరు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించాం.. సెప్టెంబరు 18న మేమంతా బయలు దేరాం.. సెప్టెంబరు 26న మాలో ఒకరు భారత సైన్యం కాల్పుల్లో చనిపోయాడు.. మరో నలుగురు పారిపోయారు.. సైనికులు నన్ను పట్టుకున్నారు. పాక్‌ సైనికులతో పోల్చితే భారత సైనికుల వ్యవహారశైలి భిన్నంగా ఉంది.. ఇక్కడి పరిస్థితులు చూశాక... కశ్మీర్‌ విషయంలో పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ, లష్కరే తొయిబా చెప్పేవన్నీ అబద్ధాలేనని అర్థమైంది. వారికి నా విన్నపం ఒక్కటే. నన్ను భారత్‌కు ఎలా పంపారో...తిరిగి మా అమ్మ దగ్గరకు అలాగే తీసుకెళ్లండి. భారత సైన్యం రక్తపాతం సృష్టిస్తుందని మాకు చెప్పారు. కానీ ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. సైనికులు నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఈ విషయం మా అమ్మకు చెప్పాలని ఉంది’’ అని అలీ పేర్కొన్నాడు. సెప్టెంబరు 18 నుంచి ఉరి, రాంపూర్ సెక్టార్లలో పలు ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మూడు చొరబాటు ప్రయత్నాలు సైన్యం అడ్డుకుంది. గత మూడు రోజుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు అడ్డుకునే ప్రయత్నాల్లో నలుగురు సైనికులు గాయపడ్డారు.








Untitled Document
Advertisements