మహిళా అధికారిణిపై సహోద్యోగి అత్యాచారం...బాధితురాలికి రెండు వేళ్ల పరీక్ష

     Written by : smtv Desk | Fri, Oct 01, 2021, 12:06 PM

మహిళా అధికారిణిపై సహోద్యోగి అత్యాచారం...బాధితురాలికి రెండు వేళ్ల పరీక్ష

శిక్షణలో ఉన్న మహిళా అధికారిణిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఓ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్‌ వాయుసేన శిక్షణ కళాశాలలో రెండు వారాల కిందట చోటుచేసుకుంది. వాయుసేన వైద్యులు తన పట్ల అమానవీయంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించింది. సుప్రీంకోర్టు నిషేధం విధించిన అనుచితమైన రెండు-వేళ్ల పరీక్షను చేసి మరింత క్షోభకు గురిచేశారని ఆమె వాపోయింది.

అంతేకాదు, విచారణలో పోలీసులు తనకు గతంలో లైంగిక అనుభవం ఉందా? అని ప్రశ్నించారని కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మహిళ తనపై అత్యాచారం జరిగినట్టు ఫిర్యాదు చేస్తే.. దానిని నిర్ధారించడానికి వైద్యులు ‘రెండు వేళ్ల’ పరీక్షను నిర్వహించేవారు. అయితే, అత్యంత అమానవీయ ఈ పరీక్ష బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమని పేర్కొంటూ 2013 మేలో సుప్రీంకోర్టు నిషేధించింది.

రెండు వేళ్ల పరీక్ష అశాస్త్రీయమైందని పేర్కొంది. అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి వారిపై అత్యాచారానికి పాల్పడటంతో సమానమని తేల్చి చెప్పింది.

ఇక, ఐఏఎఫ్ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని రెండుసార్లు కోరారని, ఒకసారి లిఖితపూర్వకంగా లేఖను సమర్పించానని, మార్పులతో ఒక లేఖపై సంతకం చేయమని అడిగారంది. అయితే, తాను సంతకం చేయడానికి నిరాకరించినట్టు తెలిపింది. మరోవైపు, పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తున్నామని, అంతర్గత విచారణ కూడా కొనసాగుతోందని ఐఏఎఫ్ తెలిపింది. దీనిపై ఇంతకంటే ఏం స్పందించలేమని పేర్కొంది.

ఈ కేసులో కోయంబత్తూరులోని గాంధీపురం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మహిళా అధికారిణి (28) కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్స్ ట్రెయిన్ కాలేజీలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న క్రీడా శిక్షణ సమయంలో ఆమె గాయపడ్డారు. గాయానికి చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే కాలేజీల శిక్షణ పొందుతున్న చత్తీస్‌గఢ్‌కు ఫ్లైట్ లెఫ్టినెంట్ అమరేందర్ (29) ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.





Untitled Document
Advertisements