‘ఇక చాలు' ...ముంబై ఇండియన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్

     Written by : smtv Desk | Sat, Oct 02, 2021, 12:29 PM

‘ఇక చాలు' ...ముంబై ఇండియన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్

ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ నాయకత్వంలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. ప్రస్తుత సీజన్ లో 11 మ్యాచ్ లాడి ఐదింట గెలిచి 10 పాయింట్లతో పట్టికలో అడుగు నుంచి మూడో స్థానంలో ఉన్న రోహిత్ టీమ్.. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సిందే. గత సీజన్ లలో ట్రోఫీ కొట్టినప్పుడు కూడా ముంబైది ఇదే పరిస్థితి. ఇక కష్టం అనుకున్న దశలో పుంజుకుని ఆ జట్టు ట్రోఫీలు గెలిచింది.

ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘ఇక చాలు.. ముంబైని అక్కడే ఆపేయండి’ అని వ్యాఖ్యానించాడు. ఈసారి తాను ఓ కొత్త విజేతను చూడాలనుకుంటున్నానని చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లేదా పంజాబ్ కింగ్స్ లో ఏదో ఒక టీమ్ ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించాడు.

‘‘ఈ ఏడాది ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అస్సలు టాప్ లోకి రావొద్దని నేను కోరుకుంటున్నా. మనందరికీ ఈ సారి ఓ కొత్త చాంపియన్ రావాలి’’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ముంబై టాప్ 4లో లేనంత మాత్రాన రోహిత్ టీమ్ కప్పు కొట్టలేదు అన్న అభిప్రాయాలు వద్దన్నారు. కచ్చితంగా ఇప్పటికీ ముంబై రేసులోనే ఉందన్నాడు.

మిగతా మ్యాచ్ లలో ముంబై గెలిస్తే వారు ప్లే ఆఫ్స్ కు కచ్చితంగా వెళ్తరన్నాడు. కానీ, అది అంతా తేలికేం కాదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గెలవాలన్న తొందర్లో ఒక్కోసారి తప్పులు చేస్తారని, జట్టు ఓటమికి అవే కారణాలవుతాయని చెప్పుకొచ్చాడు. కానీ, గత మ్యాచ్ లను చూస్తే ముంబై సత్తా ఏంటో అర్థమవుతుందన్నాడు. ఓడిపోతుందనుకున్న టైంలో గొప్పగా పుంజుకుంటుందని పేర్కొన్నాడు. ఆశల్లేని స్థితిలో ప్లే ఆఫ్స్ కు చేరుకుని కప్పు కొట్టిందని గుర్తు చేశాడు. ఇప్పుడూ ముంబైకి చాన్స్ ఉందని చెప్పాడు. అయితే, తాను గతాన్ని పట్టించుకోనని సెహ్వాగ్ తెలిపాడు.





Untitled Document
Advertisements