పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తి కాదు ?

     Written by : smtv Desk | Sat, Oct 02, 2021, 02:51 PM

పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తి కాదు ?

రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని... తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని, తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని... పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని అన్నారు. ఎన్నో ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని చెప్పారు. మనం కడుతున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయని... ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని... ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని అన్నారు.

రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని పవన్ చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి మంచిది కాదని అన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు.





Untitled Document
Advertisements