పనామా పేపర్స్‌....కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు

     Written by : smtv Desk | Tue, Oct 05, 2021, 10:53 AM

పనామా పేపర్స్‌....కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు

ప్రపంచంలో 91 దేశాలకు చెందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశాల్లో దాచుకున్న డబ్బు వివరాలతో ‘పండోరా పేపర్స్’ వెలువడ్డాయి. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘పనామా పేపర్స్‌’కు ఇది ఒక విధంగా కొనసాగింపు. ఈ పండోరా పేపర్స్‌లో ఉన్న పేర్లలో 300పైగా పేర్లు భారతీయులవే అనే విషయం మనదేశంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పండోరా పేపర్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) నేతృత్వంలో ఈ పత్రాల్లోని అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించింది. బహుళ ఏజెన్సీల బృందాలతో విచారణ జరపనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని 117 దేశాల్లో 150కిపైగా వార్తాసంస్థల్లో పనిచేసే 600 మందికి పైగా జర్నలిస్టులు ఈ పత్రాలను సిద్ధం చేశారు. దీనికోసం వీరు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను విశ్లేషించగా వచ్చిన డేటానే ఏకంగా 2.94 టెరాబైట్లు ఉన్నట్లు సమాచారం.

ఈ డేటాపై భారత ప్రభుత్వం దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. జాబితాలోని అతికొద్ది మంది పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయని, అసలు ఈ పత్రాలను విడుదల చేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెబ్‌సైటులో కూడా పూర్తి వివరాలు లేవని సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పత్రాలపై దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ జాబితాలో వందలాది మంది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, బిలియనీర్లు, సెలెబ్రిటీలు ఉన్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements