తొలిసారి డ్రోన్‌తో వ్యాక్సిన్ డెలివరీ

     Written by : smtv Desk | Tue, Oct 05, 2021, 12:14 PM

 తొలిసారి డ్రోన్‌తో వ్యాక్సిన్ డెలివరీ

కరోనా కాలంలో కొన్ని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ అందించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యలకు భవిష్యత్తులో సమాధానంగా డ్రోన్ డెలివరీ విధానం కనిపిస్తోంది. ఐసీఎంఆర్ తాజాగా తన డ్రోన్ డెలివరీ పైలట్ ప్రాజెక్టును మణిపూర్‌లో ప్రారంభించింది. వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు.

దక్షిణాసియాలో కమర్షియల్‌గా ఒక డ్రోన్ డెలివరీ చేయడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్ అండ్ అవుట్‌రీచ్ అనే ఈ ప్రాజెక్టును ఐడ్రోన్‌ అని పిలుస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు మణిపూర్, నాగాలాండ్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అనుమతులు లభించాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌లో తొలిగా వ్యాక్సిన్ డెలివరీ చేశారు.

ఈ ప్రయోగం సందర్భంగా భారత్‌లో తయారు చేసిన ఈ డ్రోన్.. 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నుంచి 15 నిమిషాల్లోనే ప్రయాణించింది. రోడ్డు మార్గం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 26 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ డ్రోన్లను కేవలం వ్యాక్సిన్ డెలివరీకే కాకుండా భవిష్యత్తులో బ్లడ్ శాంపిల్స్, అత్యవసర ఔషధాల డెలివరీకి కూడా ఉపయోగిస్తామని ఐసీఎంఆర్ వెల్లడించింది.





Untitled Document
Advertisements