ఎవ‌రినో ఉద్దేశించి నేను చేయ‌లేదు ఒక‌రిని ఉద్దేశించి నేను చేశాన‌ని అనుకుంటే ఎలా?

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 12:32 PM

ఎవ‌రినో ఉద్దేశించి నేను చేయ‌లేదు ఒక‌రిని ఉద్దేశించి నేను చేశాన‌ని అనుకుంటే ఎలా?

టాలీవుడ్ జంట‌ సమంత, నాగచైతన్య ఇటీవ‌ల‌ విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలో హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. స‌మంత పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న ఆ ట్వీట్ చేశాడు. 'బ‌డిలో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు' అని సిద్థార్థ్ అన్నాడు. అయితే, ఈ ట్వీట్ స‌మంత గురించే చేశాడ‌ని నెటిజ‌న్లు విప‌రీతంగా కామెంట్లు చేశారు.

చైతూని సామ్ పెళ్లి చేసుకోక‌ముందు రోజుల‌ను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ ఇలాంటి ట్వీట్ చేశాడ‌ని అన్నారు. దీనిపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సిద్ధార్థ్ స్పందిస్తూ తాను ఆ ట్వీట్ ఎవరినో ఉద్దేశించి చేయ‌లేద‌ని చెప్పాడు. తాను ప్ర‌తి రోజు ట్వీట్లు చేస్తుంటాన‌ని, ఆ రోజు కూడా సాధార‌ణంగానే చేశానని చెప్పుకొచ్చాడు.

ఒక‌వేళ తాను ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ త‌న గురించే చేశార‌ని ఎవ‌రో ఒక‌రు త‌న‌ వ‌ద్ద‌కు వ‌చ్చి 'కుక్క అంటావా?' అని అంటే తానేమీ చేయలేనని చెప్పాడు. తనకు, మహాసముద్రం సినిమా దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన ఓ అంశంపై తాను ట్వీట్ చేశాన‌ని అన్నాడు.

తన చిన్నప్పుడు నేర్చుకున్న విష‌యాన్ని జోడిస్తూ ట్వీట్‌ చేశానని వివ‌రించాడు. నిజానికి తన జీవితంలో జరిగిందే తాను ఆ రోజు ట్వీట్ చేశానని చెప్పాడు. అయితే, ఆ ట్వీట్ త‌న గురించే చేశారని ఎవరైనా అనుకుంటే తానేమీ చేయలేనని తెలిపాడు. తాను త‌న జీవితం గురించే మాట్లాడుతానని, వేరే వాళ్లతో సంబంధమే లేదని స్పష్టం చేశాడు.





Untitled Document
Advertisements