ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందంటోంది వాతావరణశాఖ. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు.
ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర వైపు పయనిస్తూ 12న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఆపై మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది తుఫాన్గా మారితే పూరీ నుంచి మచిలీపట్నం మధ్య విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15న తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఇది తుఫాన్గా మారినా, వాయుగుండానికే పరిమితమైనా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.
మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.