ఐపీఎల్ 2021 సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్లో తేలిపోయిన బెంగళూరు టీమ్ 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిపోయింది. దాంతో.. బెంగళూరు టీమ్ ఇంటిబాట పట్టగా.. కోల్కతా బుధవారం రాత్రి 7.30 గంటలకి షార్జా వేదికగానే ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం దుబాయ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్లో తలపడనుంది.
ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేయగలిగింది. టీమ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (39: 33 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్గా నిలవగా.. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు వికెట్లు, లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కోల్కతాకి ఓపెనర్లు శుభమన్ గిల్ (29: 18 బంతుల్లో 4x4), వెంకటేశ్ అయ్యర్ (26: 30 బంతుల్లో 1x6) మెరుగైన ఆరంభాన్నివ్వగా.. మిడిల్ ఓవర్లలో నితీశ్ రాణా (23: 25 బంతుల్లో 1x4, 1x6), సునీల్ నరైన్ (26: 15 బంతుల్లో 3x6) విలువైన పరుగులు చేశారు.
మరీ ముఖ్యంగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన డ్యానియల్ క్రిస్టియాన్ బౌలింగ్లో వరుసగా 6,6,6 బాదిన సునీల్ నరైన్.. మ్యాచ్ని కోల్కతా వైపు తిప్పాడు. ఆ ఓవర్లో మొత్తం 22 పరుగుల్ని కోల్కతా పిండుకుంది. కానీ.. చివర్లో సిరాజ్, హర్షల్ పటేల్ వికెట్లు పడగొట్టి.. బెంగళూరుని మళ్లీ మ్యాచ్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. వ్యూహాత్మకంగా ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (5 నాటౌట్: 7 బంతుల్లో), షకీబ్ అల్ హసన్ (9 నాటౌట్: 6 బంతుల్లో 1x4)మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్ని దేవదత్ పడిక్కల్ చేజార్చగా.. వెంకటేశ్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ని షబాజ్ అహ్మద్ నేలపాలు చేశాడు.