"పెట్రో ఉత్పత్తులపై పన్నుల వల్లే ప్రజలకు ఉచిత వ్యాక్సిన్లు వేస్తున్నారు"

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 12:13 PM


పెట్రోల్ ధరల పెరుగుదలను కేంద్ర మంత్రి మినరల్ వాటర్ ధరతో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి పోల్చారు. అంతేకాదు, పెట్రో ఉత్పత్తులపై పన్నుల వల్లే ప్రజలకు ఉచిత వ్యాక్సిన్లు అందజేయగలుగుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అసోంలో ఆయన రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువేం కాదని, పన్నులు అదనంగా వేయడం వల్లే పెరుగుతున్నాయని అన్నారు. అసోం సహా పలు రాష్ట్రాలు వ్యాట్ తక్కువ మొత్తంలో విధిస్తున్నాయని మంత్రి తెలిపారు.

‘పెట్రోల్ ధర ఎక్కువ కాదు.. అందులో పన్ను కూడా ఉంటుంది... ప్యాక్ చేసిన మినరల్ వాటర్ ధర ఇంధనం కంటే ఎక్కువగా ఉంటుంది.. పెట్రోల్ ధర రూ.40 అయితే అసోం ప్రభుత్వం రూ. 28 విధిస్తుంది.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూ.30 విధిస్తుంది.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.98 అవుతుంది. కానీ మీరు హిమాలయ వాటర్ తాగితే ఒక బాటిల్ ధర రూ .100.. నీటి ఖర్చు ఎక్కువ.. ఇదేం నూనె కాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు.

‘ఇంధన ధరలు ఎక్కువగా లేవు.. కానీ పన్ను కూడా తోడయ్యింది.. తప్పనిసరిగా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలంటే డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మీరు డబ్బులు ఇవ్వరు కదా.. అందుకే పన్నుల రూపంలో సేకరిస్తున్నాం’ అని అన్నారు. రాజస్థాన్‌లో పెట్రోల్ ధర అధికంగా ఉందని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ గరిష్ఠంగా విధిస్తోందని అన్నారు. మేము ఒక వేళ ధర తగ్గించినా వారు మాత్రం అదే కొనసాగిస్తారని మంత్రి ఆరోపించారు.

ఒకవేళ ఇంధన ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు నిందిస్తాయని మంత్రి రామేశ్వర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.





Untitled Document
Advertisements