రేవంత్ అనుచరుడి కిడ్నాప్ చేసిన SI

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 12:19 PM

రేవంత్ అనుచరుడి కిడ్నాప్ చేసిన SI

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్ఐ‌ ప్రదీప్‌ కుమార్‌‌పై డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ అనుచరుడిని అచ్చంపేట ఎస్ఐ కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారని, ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడారు. రెండు వారాల కిందట ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజును రేవంత్‌రెడ్డి అనుచరుడైన కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన ఖాసీం దూషించారని, ఆ కోపంతో కోస్గిలోని ఓ జిరాక్సు దుకాణం వద్ద అతడిని అచ్చంపేట ఎస్ఐ కిడ్నాప్‌ చేసి ఓ ప్రైవేటు వాహనంలో అచ్చంపేటకు తరలించారని ఆరోపించారు.

ఖాషీంని భయపెట్టడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌లో దారుణంగా కొట్టారని వంశీకృష్ణ ఆరోపించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఎస్ఐ మనో నలుగురు వ్యక్తులతో కలిసి ఖాసీంని ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోతే పోలీస్‌‌స్టేషన్‌ ఎదుట పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వంశీకృష్ణ ఆరోపణలపై అచ్చంపేట ఎస్ఐ ప్రదీప్‌కుమార్‌ స్పందించారు. విప్‌ గువ్వలను దూషించిన ఖాసీంపై చట్ట ప్రకారమే కేసు నమోదు చేశామన్నారు. ఈ నెల 2న కోస్గిలోని ఖాసీం తండ్రికి విషయాన్ని తెలిపి సర్పంచి భీంరెడ్డి, కొంతమంది గ్రామస్థుల సమక్షంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పూర్తిగా విచారించిన తర్వాతే ఖాసీంపై కేసు నమోదు చేశామని, అతడిని ఎవరూ కొట్టలేదని, విప్‌ క్యాంపు కార్యాలయానికి కూడా తీసుకెళ్లలేదని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements