వ్యాసునికి ఒక కుమారుడు కావాలనే కోరిక కలిగింది. అందుకు శివుని గురించి తపస్సు చేశాడు. తనకు జన్మించే కుమారుడు అగ్ని, భూమి, ఆకాశం, గాలి నీరు కలిస్తే ఎంతటి శక్తివంతమో అలాంటి కుమారుడు కావాలనేది అతని కోరిక . నూరు సంవత్సరాలు అతడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వ్యాసునికి అతడు కోరుకున్న కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. వ్యాసుడు శివునిచేత వరం పొంది తన ఆశ్రమంలో ఉండగా వృతాచి అనే అప్సరస చిలుక రూపంలో ఆశ్రమానికి రాగా ఆమె అందం చూసి వ్యాసుడు మోహవశుడు కాగా, అప్పుడు శుకుడు జన్మించాడు. శుకుని బాల్యంలో ఇతనికి బ్రహ్మ ఉపనయనం చేసి శుకి (చిలక) వల్ల ఇతడు జన్మించాడు కనుక శుకదేవుడని నామకరణం చేశాడు. ఇతడు బాల్యం నుండే చాల తెలివైనవాడు. తండ్రి వద్దనే వేద శాస్త్రములు నేర్చుకున్నాడు. బృహస్పతి వద్ద విద్యాభ్యాసం చేసి తన ఆశ్రమానికి తిరిగిరాగా వ్యాసుడు అతడిని వివాహం చేసుకొని గృహస్తాశ్రమం స్వీకరించమని కోరాడు అందుకు నిరాకరించిన శుకుని సన్యాసిగానే జీవిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వ్యాసుని ఆశ్రమంలోనే వ్యాసుని శిష్యుడైన శూతుడితో కలిసి భాగవతం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వ్యాసుడు ఆధ్యాత్మిక చింతన భోదించాడు. కాని శుకుడు మానసిక సంతృప్తి చెందకపోవుటచే వ్యాసుడు మిథిలా నగరం వెళ్ళి జనకుని వద్ద శిష్యరికం చేయమని చెప్పగా శుకుడు ఎన్నో దేశాలు పర్వతాలు ప్రజానీకాన్ని పరిశీలిస్తూ మిథిలా నగరం చేరి జనకునితో సంవాదన అనంతరం తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.