శబరి ఈమె అడవిలో జీవించే ఒక తెగ ప్రజలలో ఒక స్త్రీ. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈమెకు ముక్తిని ప్రసాదించాడు. పూర్వజన్మలో ఈమె చిత్ర కవచుడు అను గాంధర్వ రాజు కుమార్తె. పేరు మాలిని. ఈమె వీతిహోత్రుడు అనే పండితుడిని వివాహామాడింది. ఇతడు ఎప్పుడు బ్రహ్మ జ్ఞానం గురించి ధ్యానిస్తూ ఉంటే ఇతని భార్య మాలిని (శబరి) కల్మషుడనే వేటగాన్ని ప్రేమించింది. అది గమనించిన వీతిహోత్రుడు ఆమెను వేటగాడిని ప్రేమించావు గనుక ఆటవికురాలివి కమ్మని శపించాడు. దాంతో మాలిని కన్నీటితో ఈ శాపం నుండి విముక్తి కోరగా శ్రీరాముని దర్శనంతో విముక్తి కలుగుతుందని ఆమె భర్త శాపవిమోచనం గురించి చెప్పాడు. వెంటనే ఆమె ఆటవిక స్త్రీగా మారి మాతంగాశ్రమ ప్రాంతానికి వచ్చి జీవించసాగింది. అక్కడ ఆమె మాతంగుని శిష్యులకు సపర్యలు చేస్తూ వారి ఆశీస్సులు పొంది శ్రీరామునికై నిరీక్షిస్తూ ఉంది. శ్రీరాముని అరణ్యవాస సమయంలో ఎన్నో ఆశ్రమాలు దర్శించి శ్రీరాముడు మాతంగాశ్రమం చేరాడు. శ్రీరాముడు ఆశ్రమానికి చేరిన విషయం తెలిసి శబరి ఎన్నో ఫలాలు సేకరించి వాటిని కొరికి రుచిచూసి తరువాత వాటిని రామలక్ష్మణులకు ఇచ్చింది. ఆ తర్వాత దక్షిణానికి కొంత దూరం ప్రయాణిస్తే పంపానది వస్తుందని అది దాటిన తర్వాత ఋష్యమూక పర్వతం వస్తుందని అక్కడ సూర్య పుత్రుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు అతడి సహకారంతో సీత జాడ తెలుసుకోవచ్చు అని చెప్పి శ్రీరాముడికి నమస్కరించి ఆమె మాలిని అనే గంధర్వ స్త్రీ గా మారింది. శబరి శాపవిమోచనం పొంది మాలినిగా రూపంతరం చెందిన వెంటనే వీతిహోత్రుడు ఓ విమానంలో వచ్చి ఆమెను గంధర్వలోకం తీసుకువెళ్ళాడు. శబరి నివసించిన పంపానది తీరమే నేటి శబరిమల ఆలయం.