దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతిఒక్కరు కూడా గుడిలోకి ప్రవేశించే ముందు దేవుడికి ఎదురుగా ఉండే గడపకు నమస్కరిస్తారు కారణం దేవాలయంలోని గర్భగుడి గడప మన ఇంట్లో మాదిరిగా చెక్కతో కాకుండా రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే భక్తుడు భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు ఘోషిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. ఆ కొండలలో నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము. అందుకే దేవాలయాలలో గడపని తొక్కి దాటకూడదు. కేవలం దాటాలి. దాటే ముందు గడపకి నమస్కరించాలి.