బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ చిత్రాలు ఇవే..

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 10:33 AM

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ చిత్రాలు ఇవే..

గత కొంత కాలంగా బాలీవుడ్ నుండి చెప్పుకో దాగిన సినిమాలు రావడం లేదు. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే కంటెంట్.. విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు ఒకటీ అర వస్తున్నాయి . ఈ నేపధ్యంలో మరోవైపు సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది సినిమాలు హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ సినిమాల పరంపర కొనసాగుతోంది. ఆల్రెడీ హిట్ అయినచిత్రాలు అవడం వలనో ఏమో కానీ.. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న మీడియం రేంజ్ హీరోల వరకూ అందరూ రీమేక్ ల బాట పడుతున్నారు. పోటీ పడి మరీ భారీ రేట్లకు రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. 'జెర్సీ' 'బచ్చన్ పాండే' వంటి రీమేక్ చిత్రాలు దెబ్బేసినా.. రీమేక్స్ కి బ్రేక్స్ పడటం లేదు.
ఇప్పుడు 25 కి పైగానే సౌత్ చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అంతేకాదు కనీసం మరో 10 చిత్రాలు రీమేక్స్ చర్చల దశలో ఉన్నాయి. అందులో దక్షిణాదికి చెందిన తెలుగు తమిళ మలయాళ కన్నడ వంటి నాలుగు భాషల్లో రూపొందిన చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ రీమేక్ అవుతోన్న సౌత్ సినిమాల జాబితా చూస్తే..
తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'అల వైకుంఠపురములో' సినిమాని బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో రీమేక్ చేస్తున్నారు. 'హిట్: ది ఫస్ట్ కేస్' సినిమాని రాజ్ కుమార్ రావ్ తో తెరకెక్కిస్తున్నారు. 'నాంది' చిత్రాన్ని అజయ్ దేవగన్ రీమేక్ చేయనున్నారు.
'ఛత్రపతి' హిందీ రీమేక్ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - డైరెక్టర్ వీవీ వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 'ఎఫ్ 2' - 'బ్రోచేవారెవరురా' - 'జనతా గ్యారేజ్' వంటి తెలుగు చిత్రాలు రీమేక్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళంలో విజయం సాధించిన 'సూరరై పొట్రు' మరియు 'రాక్షసుడు' చిత్రాలను అక్షయ్ కుమార్ తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. 'విక్రమ్ వేద' రీమేక్ లో హృతిక్ రోషన్ - సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 'అన్నియన్' చిత్రాన్ని రణవీర్ సింగ్ తో.. 'ఖైదీ' సినిమాను అజయ్ దేవగన్ తో రీమేక్ చేస్తున్నారు.
'కొలమావు కోకిల' చిత్రాన్ని జాన్వీ కపూర్ ని పెట్టి హిందీలో తీస్తున్నారు. 'తడమ్' 'మానగరం' 'కోమలి' 'మాస్టర్' 'ధ్రువంగళ్ పతినారు' 'అరువి' 'పెరియారుమ్ పెరుమాల్' వంటి పలు తమిళ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ కానున్నాయి.
మలయాళంలో ఘనవిజయాన్ని అందుకున్న 'దృశ్యం 2' చిత్రాన్ని అజయ్ దేవగన్ తో రీమేక్ చేస్తున్నారు. అలానే 'డ్రైవింగ్ లైసెన్స్' 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' 'హెలెన్' 'ఫోరెన్సిక్' 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మరియు 'హృదయం' వంటి మరికొన్ని సినిమాలను హిందీలోకి తీసుకెళ్తున్నారు.
కన్నడలో సక్సెస్ అయిన 'యు-టర్న్' 'దియా' 'కిరాక్ పార్టీ' 'లవ్ మాక్ టైల్' 'గరుడ గమన వృషభ వాహన' వంటి చిత్రాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి చర్చలు జరుపుతున్నారని సమాచారం.








Untitled Document
Advertisements