తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ మరియు వైజాగ్ లలో తమిళ సినీరంగం వారు షూటింగ్ లు చేయడం విషయంపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పయనూరులో దేశంలోనే అతి పెద్దది, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఎత్తైన ప్రహరీ గోడతో 15 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి భయం లేకుండానే షూటింగులు చేసుకోవచ్చని అన్నారు. చెన్నైలో షూటింగులకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలనే తమ విన్నపం పట్ల హీరో విజయ్ సానుకూలంగా స్పందించారని సెల్వమణి అన్నారు. అజిత్ కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు. అజిత్ ప్రతి చిత్రం హైదరాబాదులోనే చిత్రీకరణ జరుపుకుంటోందని... దీని వల్ల అక్కడి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోయారని చెప్పారు. అయితే, భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు.