సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తన పేరిట జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ స్థాపించి పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. తాజాగా, జీఎంబీ బ్యానర్ పై తెరకెక్కిన మేజర్ సినిమా ట్రైలర్ ను మహేశ్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై స్పందించారు. ఆయన బయోపిక్ ఎవరైనా తీస్తే సంతోషంగా చూస్తానే తప్ప, నేనైతే సినిమా చేయలేనని స్పష్టం చేశారు. ఆయన తనకు దేవుడు అని వ్యాఖ్యానించారు. తాను ఇంతకు ముందు కూడా ఇదే విషయం చెప్పానని అన్నారు.
ఇక, మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. నిన్ననే ఆ సినిమా చూశానని మహేశ్ బాబు వెల్లడించారు. ఆఖరి అరగంట రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని అన్నారు. మేజర్ సినిమాలో భాగమైనందుకు ఈ చిత్రబృందం సభ్యులు గత రెండేళ్లుగా తనకు కృతజ్ఞతలు చెబుతున్నారని, కానీ ఇంత మంచి సినిమా తీసినందుకు తానే వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మహేశ్ పేర్కొన్నారు.