గతంలో కంటే ఈ సంవత్సరం వేసవిలో ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ ఏడాది అయితే మరీ ఎక్కువగా ప్రతిసారికంటే 40 డిగ్రీలకు మించి ఎండలు ప్రజానీకాన్ని బయటకు కూడా రానీయకుండా చేసాయి. అయితే వాతావరణ శాఖ శుభ వార్త చెప్పింది. మధ్యభారతం, వాయువ్య భారత్లో వడగాలులు వీస్తున్నాయి. కానీ సోమవారం నాటికి ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. లక్షద్వీప్పైన ఒకటి, తమిళనాడు తీరంలో మరో తుఫాన్ అవకాశం ఉండటంతోపాటు.. కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రతిసారి లాగా కాకుండా ఈసరి కొంచెం తొందరగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని , కేరళలో ప్రవేశించిన అనంతరం భారత ప్రధాన భూభాగంలోకి విస్తరిస్తాయి. మే 18న తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ వానలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.గతంలో అంచనా వేసినట్లుగానే మే 27నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే జెనమని తెలిపారు. జూన్ 8 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.