పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఏకంగా 15.08 శాతంగా నమోదు

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 04:28 PM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఏకంగా 15.08 శాతంగా నమోదు

దేశంలో రోజురోజుకి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి తాజాగా ఏప్రిల్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగి ఏకంగా 15.08 శాతంగా నమోదు అయ్యింది. డబ్ల్యూటీఐ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో నమోదు కావడం 30 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అనలిస్ట్‌లు డబ్ల్యూటీఐ ద్రవ్యోల్బణం 14.48 శాతంగా ఉండ వచ్చని అంచనా వేశారు. అయితే ఈ అంచనాల మించి మరీ ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. డబ్ల్యూపీఐ వరుసగా రెండంకెలుగా నమోదు అవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనించ దగిన విషయం. మార్చి నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14.55 శాతంగా నమోదు కాగా సంవత్సరం కిందట ఈ ద్రవ్యోల్బణం 10.74 శాతంగా ఉంది. మరోవైపు వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) కూడా ఏప్రిల్ నెలలో 7.79 శాతంగా నమోదు అయిన విషయం తెలిసిందే. 2014 నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి.
ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాల నేపథ్యంలోనే ఆర్‌బీఐ ఏప్రిల్ లో రెపో రేటును ఏకంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. నెలవారీగా చూస్తే కమోడిటీస్ ఇండెక్స్ 2.1 శాతం పెరిగింది. ఫ్యూయెల్ అండ్ పవర్ ఇండెక్స్ 2.8 శాతం మేర పైకి చేరి 38.66 శాతానికి ఎగసింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఇండెక్స్ 1.7 శాతం పెరిగి10.85 శాతానికి చేరింది. డబ్ల్యూపీఐ బాస్కెట్‌లో ఈ ఇండెక్స్ వాటా ఏకంగా 64.23 శాతంగా ఉంటుంది. క్రూడ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ద్రవ్యోల్బణం 69.07 శాతం ఉండగా ఫుడ్ ఇండెక్స్ ఇతర వాటి కన్నా ఎక్కువగా పెరిగి 3.4 శాతం మేర పైకి చేరి 8.35 శాతంగా నమోదు అయ్యింది. ఈ అంశమే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
పండ్లు, కూరగాయలు, పాలు, టీ వంటి ఇతరత్రా వాటి ధరలు పెరగడం వల్ల ఫుడ్ ఇండెక్స్ పైపైకి చేరిందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరింది. 10.85 శాతంగా ఉంది. దీని వల్ల కోర్ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 11.1 శాతానికి చేరిందని నాయర్ తెలిపారు.






Untitled Document
Advertisements