బిసి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణయ్య ను రాజ్యసభ కు జగన్ సర్కారు ఎంపిక చేసింది. ఎస్సీ ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం మొదట్నుంచి పోరాడుతున్న, మరియు ఆయా సామజిక వర్గాలకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆర్.కృష్ణయ్య తనను గుర్తించి మరింత సేవ చేసే అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్.కృష్ణయ్యను వైసీపీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసిన నేపథ్యంలో.. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీట వేయడంలో సీఎం జగన్ తర్వాతే ఏ ముఖ్యమంత్రి అయినా అని జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు .
తనను రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్కు కృతజ్ణతలు తెలియజేసేందుకే వచ్చానని చెప్పారు. తాను తెలంగాణలో మాత్రమే పోరాటాలు చేయలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోప్రతి చోట పోరాటాలు చేశానని అలాగే, తాను జాతీయ స్థాయిలో బీసీ సామాజిక వర్గం హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ప్రాంతమో లేక పార్టీ చూసో తనకు ఈ పదవి ఇవ్వలేదన్నారు. తాను చేస్తున్న పోరాటాలను గుర్తించి జగన్ తనకు ఈ పదవి కట్టబెట్టారన్నారు . తెలంగాణ వ్యక్తికి ఏపీలో రాజ్యసభ సీటు ఇవ్వడంపై వస్తున్న విమర్శలను ఆర్.కృష్ణయ్య తప్పుపట్టారు. తన సేవలను వైస్సార్సీపీలో ఉన్న నేతలంతా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైసీపీలో ఉండదన్నారు. వైసీపీలో అదే పరిస్థితి ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైసీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్.కృష్ణయ్య తెలిపారు.