రోజురోజుకి ప్రేమలో విఫలం అయ్యామంటూ.. అదేవిధంగా ప్రేమ పెళ్లి చేసుకుని కులాంతర వివాహం చేసుకున్నారంటూ పెద్దల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయి ఎన్నో యువ జంటలు. అనేక రకాల కారణాలతో కొన్ని చోట్ల అమ్మాయి, కొన్ని చోట్ల అబ్బాయి, మరికొన్ని చోట్ల ఇద్దరు బలవన్మరణం లేదా హత్యలకు గురవుతున్నారు. అచ్చం ఇటువంటిదే ఓ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పెద్దలు తమ ప్రేమను వ్యతిరేకించడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట తాము ప్రయాణిస్తున్న కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగిందీ ఘటన. బెంగళూరుకు చెందిన యశ్వంత్-జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కటయ్యే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో భాగంగా శనివారం రాత్రి ఇద్దరూ మంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపుగా బయలుదేరారు.
అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన వారు తాము చనిపోతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు అప్రమత్తమయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఉడుపి జిల్లా బహ్మార్వ తాలూకా హెగ్గుంజె సమీపంలో కారుపై పెట్రోలు పోసి లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే లోపలున్న యశ్వంత్-జ్యోతి అగ్నికి ఆహుతయయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.