రోజు రోజుకి టెక్నోలజి మెరుగవుతున్నా నేపద్యంలో.. మరొక టెక్నోలజితో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులను తీసుక రాబోతున్నారు..
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 300 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా కంపెనీలకు కొటేషన్లు పంపారు. ఒక్కొక్క బస్సును గతంలో రూ.2 కోట్లకు కొనుగోలు చేసుకున్నారు. అయితే, కొత్తగా కొనుగోలు చేయబోయే ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు రూ.1.60 కోట్లకు మాత్రమే మార్కెట్లో లభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో అన్ని ప్రధాన మార్గాలలో తిప్పడానికి ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు సిద్ధం చేశారు. అన్ని కోణాలలో అధ్యయనం చేసిన తర్వాత కొత్తగా 300 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఎయిర్పోర్టు మార్గాలలో 40 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వచ్చే ఒకటి లేదా రెండు రోజులలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగనున్నాయి. అయితే, అందుకోసం సంబంధిత డిపోల పరిధిలో ఛార్జింగ్ పాయింట్లను కూడా సురక్షితంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
400 సిటీ బస్సులు రిప్లేస్.. నగరంలో 400 సిటీ బస్సులకు కాలం చెల్లినట్లుగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 2009 తర్వాత ఇంత వరకు ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో 400 బస్సులు కొనుగోలు చేసి 15 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నది. దీంతో ఆయా బస్సులను స్క్రాప్ కింద తీసేస్తారు. వాటి స్థానంలో జిల్లా నుంచి బస్సులను సిటీ పరిధిలోకి తరలిస్తారు. ఆ బస్సులను తిరిగి సిటీ బస్సులుగా మారుస్తారు. అయితే, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో మొత్తం 1016 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త బస్సులు వచ్చిన నేపథ్యంలో వాటిలో 400 బస్సులను తిరిగి సిటీ బస్సులుగా మార్చబోతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.